పాస్ పోర్టుకు కొత్త నిబంధన
ఇకనుంచి జనన ధ్రువీకరణ పత్రం కింద ఆధార్ కార్డును పరిగణనలోనికి తీసుకుంటామని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ పాస్ పోర్టుకు కొత్త నిబంధన ప్రకటించింది. ఇప్పటి వరకు జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్ పోర్టు పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఈ ఇబ్బందులు తొలగనున్నాయి.
ఇకనుంచి జనన ధ్రువీకరణకు, చిరునామా ధ్రువీకరణకు ఆధార్ కార్డును పరిగణనలోనికి తీసుకుంటామని ఆ శాఖ తాజాగా ప్రకటించింది. అంటే.. వీటి ద్రువీకరణకు సంబంధించి ఆధార్ కార్డులో నమోదైన వివరాలను కూడా అంగీకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ తాజా చర్యతో ఇకమీదట పాస్ పోర్టుల జారీ మరింత సులభం కానుంది.

ప్రస్తుతం పాస్పోర్టులను అత్యధికంగా జారీ చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. అలాగే నకిలీ పాస్ పోర్టులకు చెక్ పెట్టేందుకు త్వరలో ఈ-పాస్పోర్టు విధానం కూడా అమలులోకి రానుంది.
హై సెక్యూరిటీ పాస్ పోర్టులుగా పిలిచే వీటిలో చిన్న చిప్ అమర్చి బయోమెట్రిక్ విధానం ద్వారా అన్ని వివరాలను పొందుపరుస్తారు. వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ మొదలవగా త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications