కేరళలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ అమలు: వేరే రాష్ట్రం నుంచి వస్తే కరోనా పరీక్ష తప్పనిసరి
తిరువనంతపురం: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం (ఏప్రిల్ 20) నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నారు.
సోమవారం సాయంత్రం కేరళ చీఫ్ సెక్రటరీ డాక్టర్ వీపీ జాయ్ అధ్యక్షుతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.
కేరళలో ఆదివారం 18,257 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 12.39 లక్షలకు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులంతా కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. పలు ఆంక్షలను కూడా విధిస్తున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు వారంపాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 2,73,810 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 1619 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి చేరింది. గత 24 గంటల్లో 1,44,178 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,29,53,821కి పెరిగింది. కాగా, దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా అరలక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం.