నా ఆశలు ఆవిరయ్యాయి.. కోర్టు బయట కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి..
నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆశలు ఆవిరయ్యాయని వాపోయారు. అంతేకాదు,దోషుల తరుపు న్యాయవాది తనవైపు వేళ్లు చూపించి.. ఉరిశిక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందని సవాల్ చేసినట్టు ఆరోపించారు. అయితే దోషులకు శిక్ష పడేంతవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
క్షమాభిక్ష పెండింగ్లో ఉండటంతో..
ఉరిశిక్షపై స్టే విధించాలని దోషుల తరుపు న్యాయవాది ఏపీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వద్ద పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీ పటియాలా కోర్టు స్పష్టం చేసింది.దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశం ఉండటంతో శిక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష వాయిదా పడినా మిగతావారికి కూడా వాయిదా వేయాల్సిందేనని తీర్పు కాపీలో పేర్కొంది. దీనికి సంబంధించి తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపించింది.

రెండోసారి డెత్ వారెంట్పై స్టే..
డెత్ వారెంట్పై స్టే ఇవ్వడం ఇది రెండోసారి అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ నెల 22నే దోషులకు ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది. కానీ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో ఉరి వాయిదా పడింది. తాజాగా మరోసారి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో డెత్ వారెంట్ను కోర్టు వాయిదా వేసింది. మరోవైపు నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అంటూ పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది.

ఏడేళ్లు గడిచినా..
డిసెంబర్ 16,2012న ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు నిర్భయపై రేప్కు పాల్పడి.. అత్యంత దారుణంగా హింసించారు. సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. యావత్ దేశాన్ని కదలించిన ఈ సంఘటనలో సెప్టెంబర్ 13,2013న కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించినప్పటికీ.. ఇప్పటికీ అది అమలుకావడం లేదు.

శిక్షను వాయిదా వేసేందుకు ఇలా..
కేసులో మైనర్ అయిన కారణంగా ఓ దోషిని మూడేళ్ల తర్వాత విడిచిపెట్టారు. మరో నిందితుడు రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు ఉరిశిక్ష అమలుకావాల్సి ఉంది. అయితే ఉరిశిక్షను వాయిదా వేయడం కోసం దోషులు ఒకరకమైన స్ట్రాటజీని అవలంభిస్తున్నారు. అంతా కలిసి ఒకేసారి న్యాయ అవకాశాలను ఉపయోగించుకోకుండా.. ఒక్కొక్కరు ఒక్కోసారి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం,ఇతరత్రా పిటిషన్లను దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications