స్వామి నిత్యానంద కేసు: ఎపి సాయం అడిగిన కర్ణాటక
హైదరాబాద్: వివాదాస్పద స్వామి నిత్యానంద కేసులో కర్ణాటక నేర పరిశోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సాయం అడిగింది. ఆడియో పరీక్షల నిమిత్తం ఈ సాయం కోరింది. టెలిఫోన్ సంభాషణలు, వీడియో కేసులో ప్రధాన పాత్ర వహించనుండటంతో అవి ఎంత వరకు నిజమైనవనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ పని చేసింది.
కర్ణాటక పోలీసులు డిజిపికి విజ్ఞప్తి పంపించారని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారని ఎపిఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎ శారద చెప్పారు. తమ వద్ద అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని, ఆడియో - వీడియో నిర్ధారణకు అవసరమైన సాధికారికమైన సాఫ్ట్వేర్ ఉందని శారద చెప్పారు.
నిత్యానంద గొంతు నమూనా తమకు అవసరమని, ఇందులో ఇతర విషయాలు కూడా ఇమిడి ఉన్నాయని, వారిని తమ ల్యాబ్కు రావాల్సిందిగా అడిగామని, వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని శారద ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రికతో చెప్పారు.
ఇదిలావుంటే, వివాదాస్పద నిత్యానంద స్వామి పురుషుడేనని తేలింది. ఆయనకు నిర్వహించిన లైంగిక సామర్థ్య పరీక్షలలో ఈ మేరకు వెల్లడైందని సీఐడీ అధికారులు వెల్లడించారు. సీఐడీ డీఎస్పీ లోకేశ్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ మేరకు వైదుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన నివేదికను రామనగర్లోని సెషన్స్ కోర్టుకు సమర్పించింది. ఇటీవల నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రఖ్యాత వైద్యబృందం నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆయనకు ఎటువంటి లోపమూ లేదని నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిత్యానంద సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షలు నిర్వహించాల్సిందేనని, వైద్యులకు సహకరించాలని సుప్రీం ఆదేశించిన విషయం విదితమే.