భారతరత్న:వాజపేయికి ఫరూక్ మద్దతు, సచిన్పై నితీష్
ఈ నేపథ్యంలో హాకీ దిగ్గడం ధ్యాన్చంద్, సామాజికవేత్త రామ మనోహర్ లోహియా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ప్రధాన మంత్రి వాజపేయిలకు కూడా ఈ పురస్కారాన్ని అందించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే వాజపేయికి భారతరత్న పురస్కారాన్ని అందించాలన్న డిమాండ్ విషయంలో 2002లో ముఖ్యంగా గోద్రా అల్లర్ల అనంతరం ఆయన వ్యవహరించిన తీరును ఒకటికి రెండుసార్లు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి మనీష్ తివారి వ్యాఖ్యానించారు.
అప్పట్లో నరేంద్ర మోడి ప్రభుత్వం విషయంలో వాజపేయి వ్యవహరించిన విధానం అనేక రకాలుగా అనుమానాలకు ఆస్కారం ఇచ్చిందని తివారీ తెలిపారు. భారతరత్న అవార్డుకు వాజపేయి అన్ని విధాలా అర్హుడని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. వాజపేయితోపాటు తన సైద్ధాంతిక గురువు రామ్ మనోహర్ లోహియాకు కూడా ఈ పురస్కారాన్ని అందించాలని తెలిపారు. నిజానికి లోహియాకు ఈపాటికే ఈ పురస్కారం వచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు.
అయితే వాజపేయికి సంబంధించి తివారి చేసిన వ్యాఖ్యలపై తానేమీ చెప్పలేనని నితీష్ అన్నారు. మరోవైపు సచిన్ టెండుల్కర్కు భారతరత్న ఇవ్వడాన్ని ప్రశ్నించిన తమ పార్టీ నేత తీరును నితీష్ తప్పు పట్టారు. ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, ఎవరినీ ఎవరూ తప్పుబట్టలేరని పేర్కొన్నారు. వాజపేయికి ఈ పురస్కారాన్ని అందించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్న కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ‘భరతరత్నం కంటే వాజపేయి చాలా గొప్ప వ్యక్తి. నేను బిజెపి నాయకుడిగా ఈ మాటలు చెప్పడంలేదు. ఒక భారతీయుడుగా వాజపేయి గొప్పతనాన్ని స్వయంగా చూసిన వ్యక్తిగా ఈ అవార్డుకు ఆయన అర్హతను చాటుతున్నాను' అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 60వ దశకం నాటి అనుభవాన్ని ఫరూఖ్ అబ్దుల్లా గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో వాజపేయి లోక్సభలో అనర్గళంగా మాట్లాడారు. ఆయన వాగ్ధాటికి మాటల పరంపరకు విషయ స్పష్టతకు ప్రధాని నెహ్రూ మంత్రముగ్ధుడయ్యారు. వెంటనే వాజపేయి వద్దకు వచ్చి ఏదో ఒక రోజు నువ్వు భారతదేశానికి ప్రధాన మంత్రివి అవుతా'వన్నారంటూ అబ్దుల్లా గుర్తుచేశారు.