మోడీకి నితీష్ ఆహ్వానం: ప్రధాని హాజరు కాకపోవచ్చు
పాట్నా: ఈ నెల 20వ తేదీన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ఆహ్వానించారు. బుధవారం నాడు నితీష్ కుమార్... స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేశారు.
ఈ నెల 20వ తేదీన పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని మోడీని నితీష్ ఆహ్వానించారని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నాలుగు రోజుల ఛత్ వేడుక ముగియడంతో ఈ ఉదయం పలువురు ప్రముఖులకు నితీశే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారన్నారు. అయితే ముందుగా ఫిక్స్ చేసిన కార్యక్రమాల వల్ల ప్రధాని మోడీ కార్యక్రమానికి రాలేకపోవచ్చని బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు సంజయ్ మయూఖ్ చెప్పారు.
బీజేపీ తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరు కావొచ్చు. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులకు ఆహ్వానాలు వెళ్లాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత కరుణానిధిని కూడా నితీషఅ ఆహ్వానించారు. అయితే, కరుణానిధి సతీమణి భార్య దయాళు అమ్మాల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉండటంతో హాజరు కాలేరని తెలుస్తోంది.