ఆ సెల్ఫీలతో గుర్తింపు: మోడీపై నితీష్ సెటైర్లు, మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్కతా/పాట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు మంగళవారం వేర్వేరుగా మండిపడ్డారు. నితీష్ కుమార్ ప్రధాని ఏడాది పాలన పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఏడాదిలో మోడీ తన కేబినెట్ మంత్రులందరూ తీసుకున్న వాటికంటే ఎక్కువ సెల్ఫీలు ఆయనొక్కరే దిగారని ఎద్దేవా చేశారు. స్వార్థంలేని నేత కోసం ప్రజలు ఓటు వేశారని, కానీ మోడీ సెల్ఫీ నాయకుడయ్యారని అన్నారు. ఏడాది కాలంలో మోడీ భారత్లో రాష్ట్రాల కంటే ఎక్కువగా విదేశాలను సందర్శించారన్నారు.
విదేశాంగ మంత్రి కంటే ఎక్కువ దేశాలను మోడీయే పర్యటించారన్నారు. అయినప్పటికీ చైనా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. మోడీ తీసుకున్న కొన్ని సెల్ఫీల్లో కొన్ని భారత్కు గుర్తింపు తెచ్చాయని సెటైర్ వేశారు.
రాజకీయంగా తనకు నచ్చిన కేసుల్ని మాత్రమే సీబీఐ చేపడుతోందని పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేరుగా విమర్శించారు. తాను పద్నాలుగు కేసులను విచారించమని సీబీఐకి ప్రతిపాదించగా వాటిని తిరస్కరించిందన్నారు.
రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ... ఆమె సీబీఐ పట్ల తన అభిప్రాయం మారిపోయిందన్నారు. రాణాఘాట్లో నన్పై అత్యాచార కేసును విచారించాలని కోరగా దానికీ సీబీఐ నిరాకరించినట్లు తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పతకం దొంగతనం కేసునూ ఛేదించలేక సీబీఐ ఫైలు మూసివేసిందన్నారు.
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ అనవసర జోక్యం అధికమవుతోందని సోమవారం మమత ట్వీట్ చేశారు. ఈ పరిస్థితి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజల ద్వారా ఎన్నికైనవేనని, ఇలా ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికీ తనదైన పరిధి ఉంటుందన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలన్నారు.