ఫోటెత్తిన తమిళ రైతులు: సినీ ప్రముఖులు సై
పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులు కేంద్రం వాస్తవిక ద్రుక్పథంతో తమ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని కోరుతున్నారు.
న్యూఢిల్లీ/చెన్నై: పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 20 రోజులకు చేరుకున్నాయి. నీటి కొరత, వర్షాభావంతో తల్లడిల్లుతూ ఇబ్బందుల పాలవుతూ ఆందోళన చేపట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించలేదు.
రాజకీయ నాయకులు మొదలు సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు నిరసన దీక్ష శిబిరాలను సందర్శిస్తూ ఇస్తున్న హామీలు ఇస్తున్నారే తప్ప పరిష్కార మార్గాలు చూపేవారు కరువయ్యారు. నిరసన తెలియజేస్తున్న వారికి సంఘీభావం తెలియజేస్తూ రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నారు.
రైతులు విభిన్న మార్గాల్లో నిరసనలు తెలియజేస్తూ అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళనకు మద్దతుగా మరోవైపు మధురై తదితర ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు సామూహిక నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు.
రుణ మాఫీకి రైతుల డిమాండ్
త్రిచి, కరూర్, తంజావూర్ ప్రాంతాలు వరి పంట సాగుకు పెట్టింది పేరు. వర్షాభావం కారణంగా వరి పంటలు పండక ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తమ రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావం వల్ల వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి తగ్గుముఖం పట్టిందని తమిళ రైతులు చెప్తున్నారు. మాజీ సీఎం జయలలిత హయాంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు మాఫీ చేశారని గుర్తుచేస్తున్న తమిళ రైతులు తమ రుణాలు మాఫీ చేయాలని జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరుతున్నారు. జంతర్మంతర్ వద్ద తమిళనాడు రైతులు మీడియా, రాజకీయ నాయకుల ద్రుష్టిని ఆకర్షించేందుకు విభిన్న రూపాల్లో ఆందోళన సాగిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెల పేరిట స్కల్స్ ప్రదర్శనతో నిరసన తెలిపారు. 100 మందికి పైగా రైతులు మాక్ అంత్యక్రియలు నిర్వహించారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతులు కూడా ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఒక రైతు చెట్టుపైకెక్కి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తే మరొకరు నిప్పటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించగా, ఇతర ఆందోళనకారులు వారిని రక్షించారు. తమ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రైతులు కూడా రుణ భారంతో మరణిస్తారని పేర్కొంటూ గత ఆదివారం మాక్ అంత్యక్రియలు నిర్వహించి మీడియా, రాజకీయ నాయకుల ద్రుష్టిని ఆకర్షించారు.
ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమ రాష్ట్ర రైతులకు హస్తినలో నివాసం ఉంటున్న తమిళులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే సినీ నటులు విశాల్, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు ఆందోళన శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. గత ఏడాది నుంచి తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు దెబ్బ తిన్నాయి. నీటి కొరతతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు ఎండిఎంకే ప్రధాన కార్యదర్శి వైకో వరకు వివిధ పార్టీల నేతలు నిరసన దీక్షా శిబిరానికి మద్దతు తెలిపారు.
పార్టీల సంఘీభావం
జంతర్మంతర్లో రైతుల ఆందోళనకు తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. నిరసన దీక్షను సందర్శించి సంఘీభావం చెప్తున్నారు. ఆందోళనకారులను ప్రోత్సహించడంతోపాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి ఆర్ దొరైక్కన్ను, పుదుచ్ఛేరి సీఎం వీ నారాయణస్వామి, తమిళ మనీలా కాంగ్రెస్ వ్యవస్థాపకుడు జీకే వాసన్, డీఎంకే ఎంపీలు టీకేఎస్ ఇలాంగోవన్, ఆర్ఎస్ భారతి, తిరుచి శివ తదితరులు చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికినా సానుకూల ఫలితాలు కనిపించడం లేదు.
రైతుల డిమాండ్లు
ప్రభుత్వ జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని, తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఎదుర్కొంటున్నందున తమ సమస్య పరిష్కారానికి వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నారు. కరువు సాయం కోసం రూ.40 వేల కోట్ల సాయం అందజేయాలని, కావేరీ నీటి యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి సమస్యలకు ఏసీ కామరాజ్ నాటి ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని కోరుతున్నారు. ఐదారేళ్ల క్రితం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. లక్ష రుణం తీసుకున్నానని పేర్కొన్న జీ మహదేవన్.. దీనికి వడ్డీ రేటు పెరిగి రూ.3 - 4 లక్షలకు చేరుకున్నదని చెప్పాడు. ‘గత ఏడాది రుణ ఎగవేతకు పాల్పడినందున మా ఆస్తులు జప్తు చేస్తామని నోటీసు ఇచ్చింది. నేను ఇంటిలో లేనప్పుడు ఆ నోటీసు అందుకున్న నా భార్య గుండెపోటుకు గురైంది. ఆ నోటీసు చదవగానే హఠాన్మరణం పాలైంది' అని గుర్తు చేసుకున్నాడు. నిరసన దీక్ష వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన రమేశ్ అనే రైతు మాట్లాడుతూ ‘నా పంట పొలంలో రెండు బావులు నీరు లేక ఎండిపోయాయి. ఒకవేళ ప్రభుత్వం కావేరి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదలచేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి' అని వ్యాఖ్యానించాడు.
బీకేఎస్ మద్దతు..
రైతుల ఆందోళనకు భారతీయ కిసాన్ మంచ్ పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయడంతోపాటు ఒక యునైటెడ్ ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేసింది. వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు ఉంచింది. జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో జీవిస్తున్న తమిళ కుటుంబాలు, విద్యార్థులు, యువకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియ జేస్తున్నారు. ‘మేం తమిళ రైతులకు మద్దతు తెలిపేందుకు ధర్నా శిబిరానికి వచ్చాం. మేం తినే తిండి, ధరించే దస్తులు తయారుచేస్తున్నవారికి కృతజ్ఞతగా ఉంటాం' సురేశ్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి తెలిపాడు.
సహాయ ప్యాకేజీ కావాలి
గత 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని కరువు అతలాకుతలం చేసిందని, రూ.30 వేల కోట్లకు పైగా కరువు సాయం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. ‘వార్ధా' తుఫాన్ తమ రాష్ట్ర ప్రజల పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిందని తమిళనాడులోని పళనిసామి సర్కార్ వాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరువు సహాయం కింద రూ.2000 కోట్ల నిధులు ఆమోదించింది. పంటలు పండక తమ వద్ద డబ్బు లేక జీవనం సాగించడం కష్ట సాధ్యంగా మారిందని, కేంద్రం విడుదల చేసిన సాయం ఒక జోక్గా మారిపోయిందని ఒక ఆందోళనకారుడు తెలిపాడు.