పౌరసత్వ సవరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు: అమిత్ షా, కఠిన చర్యలంటూ హెచ్చరిక
Recommended Video
ముంబై: పౌరసత్వ సవరణ చట్టంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని.. చట్టాన్ని అమలు చేసి తీరుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు..
మంగళవారం ముంబైలో నిర్వహించిన ఎకనామిక్ కాంక్లేవ్లో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో మైనార్టీలకు వ్యతిరేకంగా ఎలాంటి అంశం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేది లేదు..
ఏది ఏమైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతామని అమిత్ షా తేల్చి చెప్పారు. చట్టాన్ని అమలు చేయడంలో వెనుకడుగు వేసేదే లేదని అన్నారు. కాగా, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. బిల్లు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కోరుతున్నాయి. అయితే, పౌరసత్వ సవరణ బిల్లు చట్ట పరిశీలనల ఆధారంగానే రూపొందించిందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అమిత్ షా హెచ్చరిక
అంతేగాక, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్య తీసుకోబోమన్న అమిత్ షా.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేవారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ చట్టం కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తుందని అన్నారు.

రాహుల్కు చురకలు
తాను రాహుల్ సావర్కర్ కాదంటూ ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తనదైన శైలిలో చురకలంటించారు. రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరని.. అందుకు ఎన్నో గొప్ప త్యాగాలు చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కూడా ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది.












Click it and Unblock the Notifications