నిరుద్యోగులకు రైల్వేశాఖ భారీ షాక్: ఇకపై కొత్త రిక్రూట్మెంట్లు ఉండవు
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భారత రైల్వే సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఇకపై రైల్వేలో కొత్త ఉద్యోగాల నియామకంను నిలిపివేయాలని భావిస్తోంది. అంటే అవసరం లేదనుకునే పోస్టులకు చెక్ పెట్టాలని అదే సమయంలో కొత్త పోస్టులను సృష్టించకూడదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఈమేరకు రైల్వే బోర్డు ఆయా జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖ రాసింది.

కరోనాతో రైల్వేస్లో నో జాబ్స్
కరోనావైరస్ కారణంగా రైల్వేశాఖ చాలా నష్టాలు చవిచూసిందని చెప్పిన రైల్వే బోర్డు ఒక్క సేఫ్టీ డిపార్ట్మెంట్లో తప్ప కొత్తగా ఎలాంటి పోస్టులు సృష్టించరాదని స్పష్టం చేస్తూనే అనవసరపు నియామకాలను చేపట్టొద్దని ఆయా జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖ రాసింది. గత రెండేళ్లలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఇంకా భర్తీ కానట్లయితే వాటిని సరెండర్ చేయాలని సూచించింది. గత రెండేళ్ల పోస్టులపై సమీక్షించాలని సూచించింది రైల్వే బోర్డు. అంతేకాదు ఇప్పటికే వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సి ఉన్న 50శాతం పోస్టులను నిలిపివేయాలని వెల్లడించింది. ఒక్క సేఫ్టీ డిపార్ట్మెంట్లో మాత్రం నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వారికి ముప్పు లేదు
ఇదిలా ఉంటే 2018లో ప్రారంభమైన టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదని బోర్డు స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పిటికే 64,317 అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ల నియామకపు ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేసింది. అంతేకాదు వారికి అపాయింట్మెంట్ లెటర్లను కూడా పంపడం జరిగిందని రైల్వే బోర్డు వెల్లడించింది. ఇక 35,208 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీని కోవిడ్-19 సమస్య ముగిసేవరకు నిలిపివేయాలని నిర్ణయించింది. పరిస్థితులు సద్దుమణిగాక ఈ పోస్టులకు పరీక్ష నిర్వహించాలని రైల్వే బోర్డు భావిస్తోంది.
Recommended Video

ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్న రైల్వేస్
ఇప్పటికే కాస్ట్ కటింగ్లో భాగంగా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు, టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను కూడా వీలైనంతగా తక్కువ చేయాలని జోన్ల మేనేజర్లకు సూచించింది. అంతకుముందు రైల్వేశాఖలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనే దానిపై రైల్వే ఆర్థిక కమిషనర్ మంజులా రంగరాజన్ జోన్ల మేనేజర్లకు లేఖ ద్వారా వివరించారు. కౌంటర్ రిజర్వేషన్ కేంద్రాలు కూడా తగ్గించుకోవాలని సూచించడంతో రిజర్వేషన్ క్లర్క్ల సంఖ్య కూడా పరిమితి సంఖ్యలో ఉంచాలని మంజులా రంగరాజన్ సూచించారు. ఇక ప్రతి ఏటా జరిగే మీటింగులకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి రైల్వే శాఖ రైళ్లను నిలిపివేసింది. నిత్యావసర వస్తువులను మాత్రమే గూడ్సు రైళ్ల ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుస్తోంది. ప్రస్తుతం రెండు వందల ప్యాసింజర్ రైళ్లు, 30 ప్రత్యేక రాజధాని ఎక్స్ప్రెస్లను రైల్వే శాఖ నడుపుతోంది.












Click it and Unblock the Notifications