‘నో నాన్-వెజ్ డిస్ప్లే’: బీజేపీ ఢిల్లీ కార్పొరేషన్ సంచలనం
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నాన్ వెజ్ వంటకాలను దుకాణాల ముందు డిస్ప్లే చేయరాదని ఆహార అవుట్లెట్లకు త్వరలోనే కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేయనుంది.
ఎందుకంటే.. ఇటీవల జరిగిన సమావేశంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సభా నాయకుడు షికా రాయ్ స్పష్టం చేశారు.

పరిశుభ్రతతోపాటు..
పరిశుభ్రత అంశంతోపాటు, మాంసాన్ని చూడటం ద్వారా కొందరి సెంటిమెంట్ దెబ్బతినడం వంటి కారణాలతో మాంసాహార వంటకాల డిస్ప్లేను నిషేధిస్తున్నట్టు ఈయన తెలిపారు. వండిన, ముడి మాంసం ఏదైనా షాపు ఓనర్లు షాపు ముందు డిస్ప్లే చేయడంపై నిషేధం విధించనున్నట్టు ఆయన తెలిపారు.

కార్పొరేషన్ ఆమోదం
నజఫ్గర్ జోన్ నుంచి ఓ కౌన్సిలర్ హెల్త్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావించగా, దీన్ని ఎస్డీఎంసీ దృష్టికి తీసుకువెళ్లగా సభ ఆమోదించిందని కార్పొరేషన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలించి మున్సిపల్ కమిషనర్ దీనికి ఆమోదం తెలపవచ్చని లేదా తిరస్కరించవచ్చని చెప్పారు.

చాలా షాపులు సాధారణంగా..
సౌత్ ఢిల్లీలో హజ్ ఖాస్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సఫ్దర్జంగ్ గ్రీన్ పార్క్, కమల్ సినిమా, అమర్ కాలనీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించే పలు ఆహార కేంద్రాలు, రెస్టారెంట్లున్నాయి. మాంసాన్ని విక్రయించే పలు ప్రాంతాల్లో కబాబ్లు, షావర్మాలను ప్రదర్శించడం సాధారణమే.

తీవ్ర వ్యతిరేకత
అయినా.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయంపై రెస్టారెంట్ల యాజమాన్యాలు, పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆహారపదార్థాల విషయంలోనూ ప్రజలను బీజేపీ విడగొడుతోందని కాంగ్రెస్ నేతల ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications