తెలంగాణపై తగ్గం కానీ: సీమాంధ్రపై అద్వానీ హామీ
విభజన బిల్లుకు ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని వారు పార్టీ పెద్దలను కోరారు. ఈ సందర్భంగా అద్వానీ వారితో పార్టీకి రెండు ప్రాంతాలు సమానమేనని చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ బిల్లు తెస్తుందనే నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
విభజనకు మద్దతు పార్టీ విధానమని, దానిపై వెనక్కి తగ్గేది లేదని అద్వానీ వారితో చెప్పారు. తెలంగాణకు మద్దతిచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను తాము దృష్టిలో పెట్టుకుంటామన్నారు. బిల్లులో అన్ని అంశాలు ఉండేలా ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు రక్షణ, ఉద్యోగులకు న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.
కెసిఆర్పై రేణుక ఫైర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ ఎంపి రేణుకా చౌదరి బుధవారం మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు తెలంగాణ ద్రోహులు అనే హక్కు కెసిఆర్కు ఎక్కడిదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి, బెదిరించి దోచుకోవడమే ఆయన పని అని ఆరోపించారు.
తెలంగాణ రావడం కెసిఆర్కి ఇష్టం లేదన్నారు. వస్తే ఆయన దుకాణం బంద్ అవుతుందనే ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాని తన పని తాను చూసుకుంటే మంచిదన్నారు. తెలంగాణపై ఆయనకు ఎవరు హక్కు ఇవ్వలేదన్నారు.