అంగరంగ వైభవంగా NRI పెళ్లి డెకరేషన్, షాకిచ్చిన కోర్టు - ప్రెస్ రివ్యూ
పెళ్లి వేడుక కోసం అంగరంగ వైభవంగా డెకరేషన్ ఏర్పాట్లు చేసుకున్న కేరళ ఎన్నారై వ్యాపారవేత్తకు, హైకోర్టు షాకిచ్చినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనంలో తెలిపింది.
''వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై తన తనయుడు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం ప్రముఖ గురువయ్యూర్ శ్రీ కృష్ణ ఆలయంలో అన్ని ఏర్పాట్లూ చేయించారు. వివాహ వేదికను దగ్గరుండి మరీ అత్యద్భుతంగా తీర్చిదిద్దించారు.
ఇక్కడే అతడికి అనుకోని షాక్ తగిలింది. కేరళ హై కోర్టు ఈ డెకరేషన్ను తప్పుబట్టింది. వెంటనే దీనిపై సమాధానం ఇవ్వాలని ఆలయ ధర్మాధికారికి, రవి పిళ్లైకి నోటీసులు పంపించింది. వేదిక డెకరేషన్ కోసం పూలతో పాటు భారీ కొమ్మలు, కర్టెన్లు వినియోగించడంపై ప్రశ్నించింది.
దీనికి సమాధానమిచ్చిన దేవస్థానం అధికారులు.. పూల డెకరేషన్కు మాత్రమే తాము అనుమతులిచ్చామని, కొమ్మలు, కర్టెన్లు వినియోగించుకునేందుకు అనుమతులు జారీ చేయలేదని వివరించారు. అయితే గురువారం వివాహ వేడుక జరగడానికి ముందు రవి పిళ్లై స్వామివారికి భారీ కానుక సమర్పించాడు. బుధవారం సకుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి దాదాపు 725 గ్రాముల రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వడం గమనార్హం.
ఇంతటి కానుక ఇవ్వడం వల్లనే వివాహ డెకరేషన్పై దేవస్థానం అధికారులు మాట్లాడలేదనే ఆరోపణలూ ఉన్నాయి. కాగా, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో వివాహాలకు 12 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది. ప్రతి రోజూ దాదాపు 110 వివాహాలు ఈ ఆలయంలో జరుగుతున్నాయని'' ఆ కథనంలో రాశారు.
ఖైరతాబాద్ గణేశ్ వద్ద గవర్నర్ల తొలి పూజ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''ఖైరతాబాద్లో ఈసారి 40 అడుగులతో 'పంచముఖ రుద్ర మహాగణపతి'ని ప్రతిష్టించారు. ఈ ప్రఖ్యాత ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
మహాగణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొన్నట్లు'' ఆ కథనంలో పేర్కొన్నారు.
నారాలోకేశ్పై కృష్ణలంక పీఎస్లో కేసు నమోదు
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో టీడీపీ నేత నారా లోకేష్పై పోలీస్ కేసు నమోదైనట్లు 'సాక్షి' కథనాన్ని ప్రచురించింది.
''లోకేష్పై కృష్ణలంక పీఎస్లో సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
గురువారం విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్పై విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు'' ఆ కథనంలో తెలిపారు.
భూ సర్వే చేయొద్దని..ఆఫీసర్ కాళ్లపై పడ్డ రైతు
భూముల తప్పుడు వివరాలతో గెజిట్ విడుదల చేశారని, బావులను లెక్కలోకి తీసుకోకుంటే తాము నష్టపోతామని కాళేశ్వరం లింక్2 పైప్ లైన్ భూ నిర్వాసితులు వాపోయినట్లు 'వెలుగు' కథనం రాసింది.
''కాళ్లు మొక్కుతాం.. భూ సర్వే చేయకుర్రి అంటూ భూ నిర్వాసితులు, ఆఫీసర్ల కాళ్లపై పడ్డారు. అయినప్పటికీ ఆఫీసర్లు పోలీసు పహారా మధ్య కొలతలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్గ్రామంలో కాళేశ్వరం లింక్2 పైప్లైన్కోసం 150 ఎకరాల వరకు సేకరిస్తున్నారు.
ఇందులో 30 మంది రైతుల భూముల్లో బావులు ఉన్నాయి. ఆఫీసర్లు ఆ బావులను లెక్కలోకి తీసుకోకుండా భూ సర్వే కోసం గెజిట్ విడుదల చేశారు.
దీంతో గురువారం సర్వేకు వచ్చిన ఆఫీసర్లను రైతులు అడ్డుకున్నారు. బావులను గుర్తించకుండా గెజిట్ విడుదల చేసి భూనిర్వాసితుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బావులను లెక్కలోకి తీసుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోయారు.
రైతుల గోడును పట్టించుకోకుండా ఆఫీసర్లు పోలీస్ పహారా మధ్య భూ సర్వే కొనసాగించారు. సర్వేను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుంటే పోలీసులు ఫోన్లు లాక్కొని వీడియోలు డిలీట్ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు'' ఆ కథనంలో రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- 11 సెప్టెంబర్ 2001: 20 ఏళ్ల క్రితం అమెరికాలో ట్విన్ టవర్స్ కూలడానికి 2 శాస్త్రీయ కారణాలు
- అఫ్గానిస్తాన్: పంజ్షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? :డిజిహబ్
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- ఫోర్డ్: భారత్కు గుడ్బై చెబుతున్న అమెరికన్ కార్ల కంపెనీ
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- INDvsENG ఐదో టెస్టు రద్దు: 'బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు’ - ఈసీబీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)