రిపబ్లిక్ డే: సంప్రదాయాలను 'బ్రేక్' చేసిన ఒబామా
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోవత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు గంటలకు పైగా బయట ఉండి సంప్రదాయాన్ని ఉల్లంఘించారనే మాట వినిపిస్తోంది. సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఆయన ఉల్లంఘించారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు అంత సమయం బయటి కార్యక్రమాల్లో ఉండకూడదు.
అంతేకాకుండా వేడుకలకు భారత రాష్ట్రపతిని అనుసరించే సంప్రదాయాన్ని కూడా ఆయన బ్రేక్ చేశారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు వేదిక వద్దకు చేరుకోకుండా బహు పొరల బుల్లెట్ ప్రూఫ్ కారు దీ బీస్ట్లో ఆయన వేదికకు చేరుకున్నారు. ఆ రకంగా ఆయన అమెరికా సంప్రదాయాన్నే కాకుండా భారత సంప్రదాయాన్ని కూడా పాటించలేదు.
ఒబామా దాదాపు రెండు గంటల పాటు బయటే ఉండిపోయారు. అమెరికా అధ్యక్షుడి భద్రతా బాధ్యతలను చూసే సీక్రెట్ సరీవస్ భద్రతా మార్గదర్శక సూత్రాల ప్రకారం ఒబామా 45 నిమిషాలకు మించి వేదిక వద్ద బయట ఉండకూడదు. అమెరికా మీడియా ప్రకారం - అమెరికా అధ్యక్షుడు 40 నిమిషాల మించి అవుట్ డోర్ కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు.
వేదిక నుంచి వెళ్లే సమయంలో కూడా ఆయన సంప్రదాయాన్ని భగ్నం చేశారు. గణతంత్ర వేడుకలకు హాజరయ్యే ముఖ్య అతిథి వేదిక వద్దకు భారత రాష్ట్రపతితో పాటు వచ్చి, ఆయనతో పాటే వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ, వేదిక నుంచి వెళ్లే సమయంలో కూడా ఆయన రాష్ట్రపతితో పాటు లేరు. ప్రణబ్ ముఖర్జీ విడిగా వేదిక వద్దకు వచ్చారు.
బరాక్ ఒబామా తన సతీమణి మిషెల్లీతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఎట్ హోం విందుకు హాజరయ్యారు. అతిథులకు ముఖర్జీ అతిథులను పరిచయం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒబామా పక్కనే గార్డెన్ చైర్లో కూర్చున్నారు. వారిద్దరు మాట్లాడుకోవడం కనిపించింది.