కేంద్రానికి రైతుల డెడ్ లైన్... ఆలోగా రద్దు చేయాలి.. అంతవరకూ ఇళ్లకు కదిలేది లేదు : రాకేష్ టికాయిత్
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరేంత వరకూ ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ తేల్చి చెప్పారు. అక్టోబర్ 2 వరకూ కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చామని... ఆలోపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఒత్తిడిలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. శనివారం(ఫిబ్రవరి 6) దేశవ్యాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమ ముగింపు సందర్భంగా ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద రాకేష్ టికాయిత్ మాట్లాడారు.
కనీస మద్దతు ధరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని రాకేష్ టికాయిత్ డిమాండ్ చేశారు. ఇవాళ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ముందు ఘాజీపూర్ వద్ద రాకేష్ టికాయిత్ పూల మొక్కలను నాటారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పోలీసులతో రోడ్డుపై ఇనుప చువ్వలను ఏర్పాటు చేయించిందో... అదే ప్రదేశంలో రాకేష్ టికాయిత్ పూల మొక్కలను నాటడం విశేషం. 'వాళ్లు మేకులు దించితే... మేము పూలను పెంచుతాం... కేంద్రానికి,రైతులకు మధ్య ఈ అనుబంధం చాలాకాలం కొనసాగుతుంది.' అని ఈ సందర్భంగా రాకేష్ టికాయిత్ పేర్కొన్నారు.
కాగా,శనివారం మధ్యాహ్నం 12గం. నుంచి 3గం. వరకూ దేశవ్యాప్తంగా పలుచోట్లు రైతులు,వారి మద్దతుదారులు రహదారుల పైకి వచ్చి నిరసన తెలియజేశారు. అక్కడక్కడ చెదురుముదరు ఘటనలు మినహా ఈ ధర్నా కార్యక్రమం ప్రశాంతంగానే ముగిసింది. బెంగళూరు,పుణే,ఢిల్లీ నగరాల్లో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
రహదారుల దిగ్బంధం నేపథ్యంలో ఘాజీపూర్,సింఘీ,టిక్రీ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యల్ల భాగంగా పలు ప్రధాన మెట్రో స్టేషన్లను మూడు గంటల పాటు నిలిపివేశారు. అలాగే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.