భారీగా గాలి, జోరు వాన, రైళ్లు, విమానాల రద్దు : ఫొణితో ఒడిశాలో 8 మంది మృతి
భువనేశ్వర్ : సూపర్ సైక్లోన్ ఫొణి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫానుతో రాష్ట్రంలో 8 మంది మృతిచెందారు. పలుప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భీకర గాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోగా .. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, టవర్ల సంగతి చెప్పక్కర్లేదు. వేల ఎకరాల్లో పంట నష్టపోగా .. సమాచార వ్యవస్థ దెబ్బతింది.
ప్రచండ గాలులు ...
గంటకు 80 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగి .. అంధకారం నెలకొంది. ఫణి తుఫానుతో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.
నిధులు విడుదల ..
ఫొణి తుఫాన్ ప్రభావంతో ముందే వెయ్యి కోట్ల నిధులు విడదుల చేసినట్టు గుర్తుచేశారు ప్రధాని మోదీ. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పరిస్థితిని అంచనా వేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఒడిశాలో సహాయక, పునరావాస చర్యలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు.
నిలిచిన రైళ్లు, విమానాలు
ఫొణి తుఫాన్ తో కోల్కతా-చెన్నై రూట్ లో 220కిపైగా రైళ్లు రద్దు చేశారు. ఇటు భువనేశ్వర్ ఎయిర్పోర్టు నుంచి విమానాలను నిలిపివేశారు. అసోంపై తుఫాన్ ప్రభావంతో గుహవాటి ఎయిర్పోర్టు నుంచి 23 విమానాలను కూడా క్యాన్సిల్ చేశారు.