అలాంటి అధికారులపై దాడులు చేయాల్సిందే: ఆప్ ఎమ్మెల్యే బాల్యన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై ఆప్ ఎమ్మెల్యేల దాడి వివాదం సమసిపోకముందే ఆప్ ఎంఎల్ఏ నరేష్ బల్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్షు ప్రకాష్ వంటి అధికారులను కొట్టాల్సిందేనని అన్నారు. ఉత్తమ్ నగర్లో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే బల్యాన్ మాట్లాడారు.
చీఫ్ సెక్రటరీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ఇలాంటి అధికారులను కొట్టాల్సిందేనని తానంటానని చెప్పారు. సాధారణ పౌరుల పనులను నిలిపివేసే అధికారులకు ఇలా బుద్ధి చెప్పాల్సిందేనన్నారు.
మరోవైపు ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై దాడికి పాల్పడి అరెస్ట్ అయిన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.
ఈ వివాదం విషయమై విచారణ జరుపుతున్న పోలీసులు శుక్రవారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవి పుటేజీని స్వాధీనం చేసుకొన్నారు. ముఖ్యమంత్రి నివాసంపై పోలీసులు దాడులు నిర్వహించడాన్ని ఆప్ తీవ్రంగా ఖండించింది.