యూకే, ఫ్రాన్స్లో ఒమిక్రాన్ కేసుల కల్లోలం: భారత్లో అదే పరిస్థితి వస్తే లక్షల్లోనే కేసులు!
న్యూఢిల్లీ: కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్ మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది.
యూకే పరిస్థితి వస్తే.. భారత్లో రోజులకు 14 లక్షల ఒమిక్రాన్ కేసులు
డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో కూడిన ఈ కొత్త వేరియంట్ కేసులు మన దేశంలో 100కుపైగా నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి పరిస్థితులు మనదేశంలో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు. యూకేలోని పరిస్థితి భారత్ లో గనుక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ పరిస్థితి వస్తే.. భారత్లో రోజులకు 13 లక్షల ఒమిక్రాన్ కేసులు
ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో రోజుకు 65 వేల చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులతో పోలీస్తే మన జనాభా దష్ట్యా భారత్ లో ప్రతి రోజుూ రోజుకు 13 లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్ దేశాల్లో 80 శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ.. డెల్టా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఈ సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్ ఐరోపా దేశాలను వణికిస్తోంది.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...
ఈ క్రమంలోనే ప్రజలంతా అనవసర ప్రయాణాలు మానుకోవాలని పాల్ సూచించారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను కొద్ది మందితోనే జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గత 20 రోజులుగా మనదేశంలో 10వేల కన్నా తక్కువ కరోనా కేసులు వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కరోనా వేరియంట్ల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మనమంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, మనదేశంలో ఒమిక్రాన్ కేసులు రోజుకు దాదాపు 10 చొప్పున పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో 109కి చేరాయి ఒమిక్రాన్ కేసులు.