సీఎం ప్రకటన వారికి కలిసొచ్చింది.. బాదుడే బాదుడు.. విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో బాగా వైరల్ అయింది. అసలే కరోనా లాక్ డౌన్ కష్టాల్లో ఉన్న ఓ తండ్రికి ఓ స్కూల్ టీచర్ ఫోన్ చేసి ఫీజు గురించి ప్రస్తావిస్తాడు. ఆన్లైన్ క్లాసులు చెబుతున్నందుకు ఫీజులు చెల్లించాలని చెబుతాడు. దీంతో తిక్కరేగిన ఆ తండ్రి సదరు టీచర్ను చెడామడా వాయిస్తాడు. అసలు నిన్నెవరు క్లాసులు చెప్పమన్నారు..? అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. దీంతో ఆ టీచర్ కిక్కురుమనలేక ఫోన్ పెట్టేస్తాడు. కానీ కొన్ని విద్యా సంస్థలు రూట్ మార్చాయి. మొదట్లో ఆన్లైన్ క్లాసులు ఫ్రీ అని చెప్పి.. ఆ తర్వాత ఎడాపెడా ఫీజుల మోత మోగిస్తున్నాయి.

ముందు ఫ్రీ అన్నారు..
కేరళలోని కొన్ని ప్రముఖ సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏప్రిల్ మొదటివారంలో ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. లాక్ డౌన్లో మీ పిల్లలు ఇంటి వద్ద ఉండి క్లాసులు వినేందుకు వీలుగా 'ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాప్' ఒకటి తీసుకొచ్చామని.. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అందులో సూచించారు. అంతేకాదు,ఇది పూర్తిగా ఉచితమని చెప్పడంతో చాలామంది తల్లిదండ్రులు ఆ యాప్ను డౌన్లోడ్ చేశారు. అప్పటినుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల బోధన కొనసాగుతోంది.

తదుపరి నెల షాకిచ్చారు..
కానీ ఒక నెల తర్వాత ఆ విద్యా సంస్థలు తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాయి. యాప్ సేవలు పొందాలంటే ఫీజు చెల్లించాల్సిందేనని మెలిక పెట్టాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు దీన్ని కొనసాగించాలా వద్దా అన్న డైలామాలో పడ్డారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ దీనిపై మాట్లాడుతూ.. 'రెగ్యులర్ క్లాసుల పున:ప్రారంభంపై అనిశ్చితి నెలకొన్నందునా చాలావరకు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులకు ఉన్న ఆందోళనను క్యాష్ చేసుకునేందుకు చాలావరకు ఇలాంటి ఆన్లైన్ యాప్స్ స్కూళ్లతో టైఅప్ అవుతున్నాయి.' అని చెప్పారు.

సీఎం ప్రకటన వారికి కలిసొచ్చింది..
గత నెలలో చాలావరకు ప్రైవేట్,అన్ఎయిడెడ్ స్కూల్స్ 10,12 తరగతుల కోసం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ను తీసుకొచ్చాయి. అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. జూన్ 1వ తేదీ అన్ని ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల బోధన ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన ఓ గేమ్-చేంజర్లా మారిపోయింది. అప్పటినుంచి అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్నారట.. తమ సంగతేంటని ఆరా తీస్తున్నారు.దీంతో ఇదే అదనుగా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అటు విద్యాసంస్థలను,ఇటు తల్లిదండ్రులను దోచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Recommended Video

సీబీఎస్ఈ స్పష్టమైన ఆదేశాలు..
ఈ నేపథ్యంలో కేరళ సీబీఎస్ఈ స్కూల్స్ కౌన్సిల్ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికంగా భారం మోపే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను తాము ప్రోత్సహించమని పేర్కొంది. వీలైనంతవరకు స్కూళ్లు థర్డ్ పార్టీ సహకారం లేకుండా తమకు తాముగా ఆన్లైన్ క్లాసులను బోధించాలని స్పష్టం చేసింది. ఎఫెక్టివ్ ఆన్లైన్ ట్రైనింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించామని తెలిపింది.












Click it and Unblock the Notifications