వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్టు ఆపరేషన్ ఖర్చు రూ. 26 కోట్లు
చండీగఢ్: వివాదాస్పద బాబా రాంపాల్ ఆచూకీ కనిపెట్టి, అతన్ని అరెస్టు చేయడానికి రూ. 26 కోట్లు ఖర్చయ్యాయని. ఈ విషయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు శుక్రవారంనాడు వెల్లడించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాంపాల్ను జస్టిస్ ఎం జయపాల్, దర్శన్ సింగ్ డివిజన్ బెంచ్ ముందు హాజరు పరిచారు. కేసు విచారణ డిసెంబర్ 23వ తేదీకి వాయిదా పడింది.
రాంపాల్ అరెస్టు సందర్భంగా హిస్సార్ోలోని బర్వాలా సత్లోక్ ఆశ్రమం వద్ద తీవ్ర ఘర్షణ, హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్పై హర్యానా డిజిపి ఎస్ఎన్ వశిష్ట్ కోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించారు. రాంపాల్ను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పరచడానికి అయిన వ్యయంపై హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం, చండీగఢ్ పాలనా యంత్రాంగం విడివిడిగా నివేదికలు సమర్పించాయి.

రాంపాల్ ఆచూకీని కనిపెట్టి అరెస్టు చేయడానికి హర్యానా 15.43 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పంజాబ్ రూ.4.34 కోట్లు, చండీగఢ్ పాలనా యంత్రాంగం రూ.3.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3.55 కోట్లు ఖర్చు చేశాయి. దీంతో మొత్తం ఖఱ్చు 26.61 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సందర్భంగా గాయపడినవారి వైద్యానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని కోర్టు హర్యానా డిజిపిని ఆదేశించింది. రాంపాల్ అరెస్టు సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకుని 909 మంది ఎవరనే విషయాన్ని గుర్తించి తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
బాబా రాందేవ్ను పోలీసులు నవంబర్ 19వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు, రాంపాల్ మద్దతుదారులకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మహిళలు, ఓ శిశువు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 2006 హత్య కేసులో తమ ముందు హాజరు కాకపోవడంతో హైకోర్టు నవంబర్ 5వ తేదీన రాంపాల్ బెయిల్ను రద్దు చేసింది.












Click it and Unblock the Notifications