ఆపరేషన్ సింధూర్ కమాండర్ కు అయోధ్య బాధ్యత- ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం..!
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ వివాదం తర్వాత ఆలయ ప్రతిష్ఠ మసకబారిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పాలక మండలి (Ram Temple Trust) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ఆలయ ట్రస్టుకు సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను (Jeetendra Mishra) నియమించింది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన అయోధ్య రామాలయ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 39 ఏళ్లపాటు భారత వైమానిక దళంలో సేవలందించిన జితేంద్ర మిశ్రా.. ఇకపై అయోధ్య ఆలయంలో కార్యనిర్వాహక బాధ్యతల్లో నిమగ్నం కాబోతున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. దాదాపు 5 వేల మందిని పరిశీలించి ఆయన్ను ఎంపిక చేశారు. ఈ కొత్త టీమ్ లో భాగంగా మహేష్ భాగ్చంద్కా కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనుండగా మహేష్ భాగ్చంద్కా, మదన్ మోహన్ పాండే, డాక్టర్ నిర్మల యాదవ్ కొత్త ట్రస్టీలుగా నియమితులయ్యారు. స్వామి గోవింద్దేవ్ గిరి ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటారు. ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా గతంలో ఫైటర్ పైలట్ గా పనిచేశారు. జనవరి 2025లో ఆయన ఐఏఎఫ్ లో కీలకమైన ఆపరేషనల్ కమాండ్లలో ఒకటైన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలల తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన ఆ కమాండ్కు నాయకత్వం వహించారు.

ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా నియమితులయ్యారు. 38 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఆయన.. 3 వేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం కలిగిన వారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్గా కూడా పనిచేశారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్, అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో ఆయన పూర్వ విద్యార్థి కూడా. దీంతో మిశ్రాకు అయోధ్య ట్రస్ట్ సీఈఓగా కీలక బాధ్యత అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications