వివాదం: మోడీపై దిగ్విజయ్ సింగ్ అసభ్యకర వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రధానిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో ఉన్న ఓ చిత్రాన్ని పోస్టు చేశారు.
'నేను సాధించిన రెండు విజయాలు.. ఒకటి మూర్ఖులను భక్తులను చేయడం. భక్తులను మూర్ఖులను చేయడం' అని మోడీ బొమ్మతో ఉన్న ఆ చిత్రాన్ని దిగ్విజయ్ సింగ్ పోస్టు చేశారు. 'ఇది నాది కాదుగానీ.. ఈ చిత్రాన్ని పోస్టు చేయకుండా ఉండలేకపోతున్నాను. సంబంధిత వ్యక్తికి నా క్షమాపణలు. ఆయన జనాలను వెర్రివాళ్లను చేయడంలో దిట్ట' అని ఆ పోస్టుపై వ్యాఖ్యానించారు.
అయితే 'మూర్ఖులు' అనే అభివ్యక్తీకరణకు ఆయన వాడిన పదం హిందీలో అత్యంత అసభ్యకరమైంది. అవతలి వ్యక్తులను ఘోరంగా అవమానించడానికి ఆ పదం వాడతారు. దీంతో, దిగ్విజయ్ సింగ్ పోస్టుపై బీజేపీ భగ్గుమంది. బిజెపిఅధికారప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ దానిపై స్పందించారు.
ప్రధానిని అవమానించడమంటే దేశాన్ని, జాతిని అవమానించడం అన్న ఇంగితం లేకుండా వ్యవహరించారని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెస్ తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎస్ నరసింహారావు డిమాండ్ చేశారు. అయినా దిగ్విజయ్ సింగ్ వెనక్కి తగ్గలేదు.
'నాపై మోదీ భక్తులు చేస్తున్న విమర్శలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే వారినీ మోడీ వెర్రివాళ్లను చేస్తున్నాడు. పైగా డబ్బూలూ ఇస్తున్నాడు' అని మరో వివాదాస్పద ట్వీట్ చేశారు.