కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో శివుడికి బెర్త్ కేటాయింపు రగడ..మినీ టెంపుల్ ఏర్పాటుపై మండిపడిన ఓవైసీ
కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో శివుడికి బెర్త్ కేటాయించటం , రైలు బోగీలోనే పూజలు చేసి ఏకంగా మినీ టెంపుల్ గా మార్చటం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది . తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చెయ్యటంతో ఈ వివాదం కాస్త వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే .
మరో జలియన్వాలా బాగ్ విషాదమేనా: షాహీన్బాగ్లో ఏం జరగబోతోంది..ఓవైసీ చెబుతున్నదేమిటి..?
కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఏకంగా శివునికి బెర్త్ కేటాయించిన అధికారులు
మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగే కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఏకంగా శివునికి మినీ టెంపుల్ ఏర్పాటైంది . ఇక రైల్వే అధికారులు ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. సహజంగా మనుషులకు ట్రైన్ బెర్త్ లు రిజర్వ్ చేస్తారు కానీ ఇక్కడ శివుడికి బెర్త్ రిజర్వ్ చెయ్యటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రైలు మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న నేపధ్యంలో దీని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేశారు.
బి5 బోగీలో సీట్ నెంబర్ 64... శివుడికి రిజర్వ్డ్
బి5 బోగీలో సీట్ నెంబర్ 64 పూర్తిగా ఆయనకే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి సీటును పూలతో చక్కగా అలంకరించారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ పేర్కొన్నారు . రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ను అంటే మూడు జ్యోతిర్లింగాలను కలిపే ‘కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్' లో శివుడి బెర్ట్ ఏర్పాటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని , ఈ నెల 20 నుండి సర్వీసులు
ప్రధాని మోదీ ఈ రైలును ఈ నెల 16 న పచ్ఛజెండా ఊపి ప్రారంభించారు. ఇక ఈ రైలు వారణాసి నుంచి ఇండోర్ వరకు 1131 కి.మీ. దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. వారానికి మూడు సార్లు నడిచే ఈ ట్రెయిన్ ఈ నెల 20 నుంచి తన సర్వీసులను ప్రారంభిస్తుంది . ఇక ఈ రైలు ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే దీనిపై దుమారం రేగటం కనిపిస్తుంది. ఇక శివుడికి బెర్త్ కేటాయించటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు .
శివుడికి బెర్త్ కేటాయింపుపై ఓవైసీ అభ్యంతరం ... పీఎం కార్యాలయానికి ట్వీట్
ఈ రైల్లో 64 వ నెం. బెర్తును మినీ టెంపుల్ గా మార్చడం పట్ల పరోక్షంగా ఆయన విమర్శించారు . ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ వార్త తాలూకు ఫోటోను, రాజ్యాంగాన్ని ట్యాగ్ చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి ట్వీట్ చేశారు. అటు-దేవుడికి రైల్లో బెర్తును రిజర్వ్ చేయడమన్నది ఇదే మొదటిసారని శివుడి కోసం ఒక సీటు రిజర్వు చేయబడి, ఖాళీగా ఉంచడం ఇదే మొదటిసారి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాళ్ భగవంతుడి కోసం ఈ సీటు రిజర్వు చేయబడిందని ప్రజలకు తెలిసేలా సీటుపై ఒక ఆలయం కూడా ఏర్పాటు చేశారు అని నార్తర్న్ రైల్వే అధికారులు తెలిపారు అంటూ ట్వీట్ చేశారు .
ఆధ్యాత్మికత తెలిసేలా రైల్లో ప్రత్యేక ఏర్పాట్లు .. రాజ్యాంగ విరుద్ధం అన్న ఓవైసీ
ఏసీ బోగీలున్న ఈ ట్రెయిన్ లో అంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా మెల్లగా భక్తి సంగీతం వినిపిస్తుంటుంది ప్రతి కోచ్ లోను ఇద్దరు గార్డులు ఉంటారు. . అలాగే కేవలం శాఖాహారం మాత్రమే అందిస్తారు. ఇక ఈ రైలు వివాదం , రైల్లో శివుడికి బెర్త్ కేటాయింపు రగడ ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి . అది జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న రైలుగా అధికారులు చెప్తుంటే ఏదైనా రైలేనని ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.