ఆక్సిజన్ సంక్షోభం: తీవ్ర పోరాటం తర్వాత ఢిల్లీ కోటా పెంపు, కేంద్రానికి కేజ్రీవాల్ కృతఙ్ఞతలు
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని , కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి కేటాయించిన కోటాను తగ్గించి ఇతర రాష్ట్రాలకు మళ్ళించిందని ఆరోపించిన ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ఆక్సిజన్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఆక్సిజన్ కోటాను 378 మెట్రిక్ టన్నుల నుండి 500 మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచింది. ఆక్సిజన్ కోటాను పెంచడంపై ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ కోటాను పెంచడం పై కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు .
ఢిల్లీ ఆక్సిజన్ కోటాను పెంచినందుకు కేజ్రీవాల్ ట్వీట్
ఢిల్లీ ఆక్సిజన్ కోటాను పెంచినందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రాజధాని కోసం కోటా పెంచాలని ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.ఢిల్లీకి ఆక్సిజన్ అందించాలని కేజ్రీవాల్ మంగళవారం కేంద్రాన్ని చేతులు జోడించి అభ్యర్థించారు . బుధవారం ఉదయం నాటికి స్టాక్స్ తిరిగి నింపకపోతే నగరంలో గందరగోళం ఏర్పడుతుందని డిప్యూటీ మనీష్ సిసోడియా చెప్పారు. ఈ నేపధ్యంలో కేంద్రం ఆక్సిజన్ నిల్వలు పెంచటం కాస్త ఉపశమనం కలిగించిన అంశం.
ఢిల్లీలో అవసరాలకు తగ్గట్టు ఆక్సిజన్ సరఫరా లేదు
అయినప్పటికీ ఢిల్లీలో ప్రస్తుత అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. ఏ ఆస్పత్రికి వెళ్లిన ప్రాణవాయువు కోసం విలవిలలాడుతున్న కరోనా బాధితులు కనిపిస్తున్నారు .ఎక్కడికి వెళ్ళినా ఖాళీ సిలిండర్లు దర్శనమిస్తున్న పరిస్థితి. ఊపిరాడక పేషెంట్లు ఆక్సిజన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీలో ఇంకా ఆక్సిజన్ అవసరం ఉన్న నేపథ్యంలో అదనపు ఆక్సిజన్ ఒడిస్సా నుండి వస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుత అవసరాలకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముందన్న ఢిల్లీ సర్కార్
మొత్తం ఢిల్లీలో ప్రస్తుత అవసరాలకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో చిన్న, పెద్ద ఆసుపత్రులు అన్న తేడా లేకుండా ప్రతి ఆస్పత్రిలోనూ కరోనా బాధితులు నిండిపోయారు. ఇక ఆసుపత్రుల పరిస్థితిని చూస్తే ఢిల్లీలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ లో కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ స్టాక్ మాత్రమే ఉంది . బాత్రా హాస్పిటల్ లో 9 గంటలు , హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో 9 గంటలు , రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో 10 గంటలు , లోక నాయక్ ఆసుపత్రిలో 12 గంటలు , మ్యాక్స్ ఆస్పత్రిలో 20 గంటలు, దీన్ దయాల్, అంబేద్కర్ నగర్ ఆస్పత్రుల లో 24 గంటలు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి .
Recommended Video
ఆక్సిజన్ కోసం విలవిలలాడుతున్న ఢిల్లీ కరోనా బాధితులు
ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతున్న పేషెంట్లు రెండు వేల మందికి పైగా ఢిల్లీలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే గంగారాం ఆసుపత్రికి 14 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ను కేంద్రం పంపించింది. ఈ ఆక్సిజన్ రెండు రోజులకే సరిపోతుందని వైద్య అధికారులు చెబుతున్నారు . జీటీబీ హాస్పిటల్లో మరీ దారుణంగా 500 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరంగా మారింది. ఏది ఏమైనా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులకు తగ్గట్టు ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.