పాకిస్థాన్ కు మరోసారి షాకిచ్చిన భారత్.. సింధూ జలాలు కావాలంటే..!
భారత్- పాకిస్థాన్ మధ్య ఏళ్లుగా ఉద్రిక్తతలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా అవి డబుల్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు తేలడంతో ఆ దేశంపై భారత్.. మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇక పాకిస్థాన్ పై దాడులే కాకుండా దౌత్య పరంగా, ఆర్థిక పరంగా అత్యంత కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంది భారత్. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్ కు నీటి కష్టాలు ఎదురయ్యాయి.
అక్కడి ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సింధూ జలాల విషయంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేస్తేనే సింధూ జలాల ఒప్పందంపై ఆలోచిస్తామని.. అప్పటివరకూ ఈ ఒప్పందం నిలిపివేసే ఉంచుతామని.. ఆ తర్వాతే చర్చలు జరుపుతామని తేల్చి చెప్పింది.

ఇక సింధూ జలాలను పునరుద్ధరించాలని గత కొన్ని నెలలుగా అటు పాకిస్థాన్ మిలిటరీ, ఇటు రాజకీయ నాయకులు భారత్ కు అనేక రకాలుగా వార్నింగ్ లు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ పై యుద్ధం చేపడతామని.. అవసరమైతే అణు దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. అయితే భారత్ మాత్రం.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెడితేనే సింధూ జలాల ఒప్పందాన్ని అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు తాము బాధితులమని ప్రపంచదేశాల ముందు పాకిస్థాన్ సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నా ఏ దేశం కూడా నమ్మడం లేదు. అటు అంతర్జాతీయ న్యాయస్థానం వద్దకు కూడా వెళ్లినా పాకిస్థాన్ కు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.












Click it and Unblock the Notifications