ఢీ అంటే ఢీ అంటున్న పన్నీర్-పళనిస్వామి: ఫ్లోర్ టెస్టుకే గవర్నర్ మొగ్గు!?
అటార్నీ జనరల్ సూచన మేరకు 'కాంపోజిట్' బలపరీక్ష నిర్వహించడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు మొగ్గుచూపే అవకాశముంది.
చెన్నై: ఓవైపు అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఎప్పుడెప్పుడు లొంగిపోతారా? అని అటు చెన్నై పోలీస్ వర్గాలతో పాటు ఇటు బెంగుళూరులోని పరప్పన జైలు అధికారులు ఉత్కంఠతో వేచి చూస్తుండగా.. మరోవైపు పన్నీర్-పళనిస్వామి మధ్య పోరు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
నిన్నటిదాకా శశికళతో హోరాహోరీ తలపడ్డ పన్నీర్ సెల్వం ఇప్పుడు పళనిస్వామితో పోరుకు సిద్దమయ్యారు. సుప్రీం తీర్పుతో ఇక సీఎం తానే అని భావించిన పన్నీర్ కు శశికళ పళనిస్వామితో చెక్ పెట్టేసింది. పైగా ఎమ్మెల్యేలు సైతం శశికళ మాటకు కట్టుబడి ఉండటం.. పళనిస్వామికి వారంతా జై కొట్టడంతో పన్నీర్ 'సీఎం' కల కూడా ఆచరణ రూపం దాల్చడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, అన్నాడీఎంకె శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి, ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం బద్ధ విరోధులని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమ్మకు విధేయులుగా మెలిగిన వీరిద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ మాత్రం ఇంకా ఎవరికి కబురు పెట్టకుండా తన జాప్యాన్ని సాగదీస్తూనే ఉన్నారు.
పన్నీర్-పళని వర్గాల్లో ఎవరిని ముందు ఆహ్వానించినా ఎక్కడ విమర్శలు ఎదురవుతాయోనన్న ఆలోచనతో గవర్నర్ ఎవరికి కబురు పెట్టలేదని తెలుస్తోంది. దీనికి ప్రత్యమ్నాయంగా అటార్నీ జనరల్ సూచన మేరకు 'కాంపోజిట్' బలపరీక్ష నిర్వహించడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు మొగ్గుచూపే అవకాశముంది.
కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారీటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నవారే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తారని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో విమర్శలకు తావివ్వకుండా చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
కాగా, అన్నాడీఎంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే పళనిస్వామి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు ఫ్యాక్స్ చేశారు. సాయంత్రం గవర్నర్ను కలిసి లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, తనను ఆహ్వానించాలని కోరారు.
పళనిస్వామి గవర్నర్ కు లేఖ అందజేసిన అనంతరం పన్నీర్కు మద్దతు తెలుపుతున్న ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.