మంట పెట్టిన కాంగ్రెస్: ఆజ్యం పోసిన బీజేపీ: భగభగలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరులో ఇవ్వాళ కూడా ఎలాంటి మార్పు రాలేదు. వేర్వేరు అంశాల మీద అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధం చోటు చేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు సంధించుకున్నారు. ప్లకార్డులను ప్రదర్శించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు వారించినప్పటికీ..వారు వినిపించుకోలేదు. దీనితో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

గందరగోళ పరిస్థితులు..
ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే రోజూలాగే ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిల్చున్నారు. ప్లకార్డులను ప్రదర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడంపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, మజ్జిగ, బార్లీ వంటి ఆహార వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని తప్పుపట్టారు. ఇదివరకెప్పుడూ లేనివిధంగా నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం ద్వారా వాటి రేట్లు పెరిగాయని, సామాన్యలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

ఎదురుదాడికి..
సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ ఇచ్చారు. దీనిపై చర్చించాలంటూ ఆయన పట్టుబట్టారు. అదే సమయంలో అధికార పార్టీ సభ్యులు కూడా ఎదురుదాడికి దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా సంబోధిస్తూ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.

12 గంటలకు వాయిదా పడినా..
యావత్ దేశానికి..అఖిల భారత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. ఇరు పక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పలువురు సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి, నినాదాలు చేశారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో వైస్ ఛైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. దీనితో తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

ఎవరి వాదనలు వారివి..
ఆ తరువాత ఉభయసభలు సమావేశమైనప్పటికీ.. ఎలాంటి మార్పు రాలేదు. దీనితో సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. వాయిదా పడ్డ అనంతరం పలువురు సభ్యులు పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎవరి వాదనను వారు సమర్థించుకున్నారు.

ఎన్డీఏకు..
ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అంటూ అధిర్ రంజన్ చౌధరి సంబోధించడం.. అధికార ఎన్డీఏ కూటమి సభ్యులకు కొత్త అస్త్రాన్ని అందించినట్టయింది. సోనియా గాంధీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పేంత వరకూ తాము వదలబోమని బీజేపీకి చెందిన కొందరు మహిళా సభ్యులు స్పష్టం చేశారు. దీనితో సోమవారం సభ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడే స్పష్టం చేసినట్టయింది.












Click it and Unblock the Notifications