చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజకీయ పెనుతుపాను ఖాయంగా కనిపిస్తోంది. కీలకమైన 11 బిల్లుల్ని ఆమోదింపజేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం దేశాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా, ఆర్థిక వ్యవస్థ పతనం, చైనాతో సరిహద్దు విభేదాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, అనూహ్య రీతిలో చైనా సరిహద్దు అంశాలపై సభలో చర్చించకూడదని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సోమవారం(సెప్టెంబర్ 14) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించబోవట్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం.
చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్
సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గత నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, భారీ ఎత్తున బలగాలను మోహరించిన డ్రాగన్.. ఎల్ఏసీని ఆనుకుని ఉండే కీలక ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండటం, దానిని మనవాళ్లు సమర్థవంతంగా తిప్పికొడుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 15న గాల్వాన్ లోయలో హిసాత్మక ఘర్షణల్లో మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 ఏళ్ల తర్వాత.. గతవారం చుషూల్ సెక్టార్ లో కాల్పుల మోత కూడ చోటుచేసుకుంది. సైనిక చర్చలు, మాస్కో వేదికగా భారత్, చైనా కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు సైతం దాదాపు ఫెయిల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పితీరాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుండగా.. సరిహద్దు ఉద్రిక్తతలు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనిపై బహిరంగంగా చర్చించడం కరెక్ట్ కాదని, అందుకే ఈ వర్షాకాల సమావేశాల్లో చైనాపై చర్చ ఉండబోదని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
రాబోయే రెండు వారాలు కీలకం..
చైనాతో సరిహద్దు గొడవలకు సంబంధించి రాబోయే రెండు వారాల్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని, అవి జరగకముందే పార్లమెంట్ లో చర్చ జరపడం సరికాదని సీనియర్ కేంద్ర మంత్రి అన్నట్లుగా ‘ఇండియా టుడే' పేర్కొంది. ‘‘మేం చర్చకు భయపడట్లేదు. కీలక అంశాలపై పార్లమెంట్ లో సమగ్రంగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ చైనాతో సరిహద్దు వ్యవహరాలు చాలా సున్నితమైనవి. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు మరియు సమగ్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలను బహిరంగంగా చర్చించడం సబబు కాదు'' అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ కు సంచలన సవాల్ - ఒకే అంటే తక్షణం రాజీనామా: ఎంపీ రఘురామ - కొత్తగా పోరాట సంస్థ
రాజ్ నాథ్ ప్రకటనకు ఛాన్స్?
సరిహద్దు వివాదాలపై పార్లమెంట్ లో చర్చ జరపరాదని మోదీ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నప్పటికీ, దానిని ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరిహద్దు వివాదంపై రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ‘‘రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ' భేటీలో ఎన్సీపీ నేత శరద్ పవార్.. సరిహద్దు అంశాలపై త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సరిహద్దులో ఏం జరుగుతున్నదో పార్లమెంట్ లో చెప్పాల్సిందేనని కేంద్రాన్ని పవార్ డిమాండ్ చేశారు. సభలోనూ ప్రతిపక్షాలు గొడవకు దిగే అవకాశాలున్న దరిమిలా.. పరిస్థితి మరీ గందరగోళంగా మారితే.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ చేత బ్రీఫింగ్ మాత్రం ఇప్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అఖిలపక్షం రద్దు.. బీఏసీలోనే అన్నీ..
సాధారణంగా ప్రతి పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే ఈసారి మాత్రం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోవడంలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం కూడా నిర్ధారించినట్లుగా ‘ఇండియా టుడే' తెలిపింది.
కాగా, ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ మాత్రం ఆదివారం యధావిధిగా జరుగనుంది. అందులోనే సభా కార్యకలాపాలపై పూర్తి క్లారిటీ రానుంది. సోమవారం(సెప్టెంబర్ 14)న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సభను వినూత్నంగా నిర్వహించనున్నారు. క్వశ్చన్ అవర్ ఎత్తేసి, రాజ్యసభను ఉదయం పూట నాలుగు గంటలపాటు, లోక్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలపాటు నిర్వహిస్తారు.