మహిళా యజమాని హంతకుడిని పట్టిచ్చిన చిలుక
విజయ్ శర్మ అనే వ్యక్తి భార్య నీలం హత్యకు గురైంది. ఆమెతో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా హత్యకు గురైంది. ఈ హత్య ఈ నెలారంభంలో జరిగింది. సోమవారంనాటి వరకు పోలీసులు ఈ హత్యల మిస్టరీని ఛేదించలేకపోయారు.
జంతు ప్రేమికురాలైన నీలం ఓ శునకాన్ని, ఓ చిలుకను పెంచుకుంది. కుటుంబ సభ్యులు అమర్ ఉజాలాకు ఈ విషయం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నీలం హత్య తర్వాత చిలుక ఆహారం తీసుకోవడం మానేసింది.
విజయ్ సమీప బంధువు ఆశు ఇంటికి వచ్చినప్పుడు చిలుక భయంతో వణికిపోతూ పంజరంలోకి వెళ్లిపోతూ వచ్చింది. మిగతా రోజుల్లో మాత్రం ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. రెండు రోజుల క్రితం విజయ్ ఇంటి వచ్చి చిలుకతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అయితే, అది ఉలుకలేదు, పలుకలేదు.
తన భార్య హత్య కేసులో అనుమానితుల పేర్లను వినిపిస్తూ విజయ్ ముందుకు సాగాడు. చివరకు చిలుకలో కదలిక వచ్చింది. ఆశు పేరు చెప్పగానే ఉస్నే మారా, ఉస్నే మారా (అతనే చంపాడు, అతనే చంపాడు) అంటూ అరిచింది.
నీలం హత్య కేసులో తొలుత ఆశును కూడా పోలీసులు అనుమానించారు. అయితే, కుటుంబ సభ్యులు పోలీసులతో విభేదించారు. చిలుక నుంచి తనకు సమాచారం అందగానే విజయ్ ఆశును కస్టడీలోకి తీసుకుని, విచారించాలని పోలీసులకు సూచించాడు.
ఆశు, తన అనుచరులతో నీలంను హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు శునకం వారిపైకి దూకింది. కుక్క ఆశు వేలిని కొరికింది కూడా. వారు నీలంను, శునకాన్ని హత్య చేసినట్లు పోలీసులు అమర్ ఉజాలాకు చెప్పారు.