పఠాన్ కోట్ ఉగ్రదాడి: పాక్ ప్రధాని నవాజ్ మీటింగ్
పఠాన్ కోట్/ఇస్లామాబాద్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి సంబంధించి భారత్ అందించిన సాక్ష్యాధారాలపై దర్యాప్తును సమీక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు.
పఠాన్ కోట్ దాడులకు సంబంధించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ లో శుక్రవారం రెండు సార్లు ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ రెండు భేటీలలో పఠాన్ కోట్ ఉగ్రదాడి గురించి సుదీర్ఘంగా చర్చించారు.
పాక్ నుంచి ఉగ్రవాదాన్ని తిరిమి వెయ్యడానికి భారత్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ విషయంలో భారత్ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించామని భేటీ అనంతరం పాక్ పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల ఇరుదేశాల మధ్య చర్చలతో నెలకొన్న సానుకూల వాతావరణం నేపధ్యంలో చర్చల ప్రక్రియకు ఇరుదేశాలు కట్టుబడి ఉంటాయని ఆశాభావం వ్యక్యం చేశారు. పాక్ గడ్డ మీద ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే అందరూ ఉగ్రవాదులే అని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, విదేశీ వ్యవహారాల్లో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్, జాతీయ భద్రతా సలహాదారు నాజర్ ఖాన్ జుంజువా, విదేశాంగ కార్యదర్శి అయిజాజ్ అహమ్మద్ చౌధురి తదితరులు పాల్గోన్నారు.