సంజయ్ రౌత్ కేసు విషయంలో ఈడీకి చుక్కెదురు?
ముంబై: శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను ముంబై న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి అప్పగించింది. ఈడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. పట్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ తరఫు అడ్వొకేట్.. న్యాయస్థానానికి సమర్పించారు. మరిన్ని వివరాలను రాబట్టుకోవడానికి ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
సంజయ్ రౌత్ను ఎనిమిది రోజుల పాటు విచారించడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1,034 కోట్ల రూపాయలకు సంబంధించిన భూ కుంభకోణం కావడం వల్ల పూర్తిస్థాయి వివరాలను రాబట్టుకోవాల్సి ఉందని, ఎనిమిది రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనిపై వాడివేడి వాదనలు సాగాయి. సంజయ్ రౌత్ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. ఈ అరెస్ట్ రాజకీయాలతో ముడిపడి ఉందని చెప్పారు. రాజకీయ ప్రేరేపితమైన చర్యగా అభివర్ణించారు.
సంజయ్ రౌత్ హార్ట్ పేషెంట్ అని, ఆయన సర్జరీ జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించిన మెడికల్ డేటా, ఇతర ప్రిస్కిప్షన్లను న్యాయమూర్తులకు సమర్పించారు. ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తరువాత ఎనిమిది రోజుల పాటు సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. నాలుగు రోజుల వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇవ్వాళ్టి నుంచి 4వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
పట్ర చాల్ భూ కుంభకోణం కేసులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే ముంబైలోని ఆయన నివాసం మైత్రీపై దాడులు సాగించారు. తెల్లవారు జాము నుంచీ విస్తృతంగా సోదాలను నిర్వహించారు. అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉండకపోవడంతో అరెస్ట్ చేశారు. సంజయ్ రౌత్కు రెండుసార్లు సమన్లను జారీ చేశారు గానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
దీనితో వారే స్వయంగా ఆయన నివాసంపై దాడులకు దిగారు. ఏడు గంటలకు పైగా సాగించిన విస్తృత సోదాలు, విచారణల అనంతరం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇదివరకు సంజయ్ రౌత్ సమీప బంధువు ప్రవీణ్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన భార్య వర్ష రౌత్కు చెందిన 11 కోట్ల రూపాయలను అటాచ్ చేశారు.