పార్లమెంట్లో పెగాసస్ రచ్చ: ఐటీ మంత్రి చేతిలో స్టేట్మెంట్ లాక్కొని చింపిపారేసిన టీఎంసీ ఎంపీలు
రాజకీయ, మీడియా రంగాలకు చెందిన వందల మంది ప్రముఖులపై కేంద్ర ప్రభుత్వమే రహస్య నిఘా సాగించిందన్న ఆరోపణలపై గురువారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. ఇజ్రాయెల్ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై అధికార, విపక్షాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. నిఘా కుట్రతో కేంద్రానికి సంబంధం లేదని ఇదివరకే ప్రకటనలు వెలువడగా, అదే విషయాన్ని పార్లమెంటులో అధికారికంగా ప్రకటించేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి సిద్ధం కాగా, విపక్ష టీఎంసీ ఎంపీలు అనూహ్య చర్యకు పాల్పడ్డారు..
పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. మంత్రి వైష్ణవ్ చేతుల్లోంచి స్టేట్మెంట్ పేపర్లు లాగారు. ఆ తర్వాత ఆ పేపర్లు చింపివేసి సభాపతి వెల్లోనే వెదజల్లారు. టీఎంసీ ఎంపీల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రధానంగా టీఎంసీ ఎంపీ శంతను సేన్ దూకుడుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురతి, ఎంపీ శంతను సేన్ మధ్య మాటల ఘర్షణ కొనసాగింది. పెగాసస్ ప్రాజెక్టు రిపోర్ట్ను చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీఎంసీ ఎంపీల ప్రవర్తనను బీజేపీ ఎంపీ స్వపన్దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేపర్ లాగేసిన అంశాన్ని ప్రశ్నించగా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ సమాధాన్ని దాటవేశారు.
మంత్రి చేతిలో నుంచి పేపర్లు లాక్కొని చైర్ పైకి విసరడాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఖండించారు. మార్షల్స్ రగ ప్రవేశం చేసిన తర్వాతగానీ సభలో పరిస్థితి అదుపులోకి రాలేదు. గందరగోళం నడుమ ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు. గతంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూతన రైతు చట్టాలను ప్రవేశపెడుతున్న సమయంలో.. చైర్ మైక్ లాగేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications