జనతా కర్ఫ్యూ.. అంతా ప్రశాంతంగా ఉన్నవేళ.. షాహీన్బాగ్లో పెట్రోల్ బాంబు..
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతున్నవేళ.. ఢిల్లీలోని షాహీన్బాగ్లో ఒక్కసారిగా పెట్రోల్ బాంబు కలకలం రేపింది. ఆదివారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు షాహీన్బాగ్లో సీఏఏ వ్యతిరేక ఆందోళన శిబిరం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లపై పెట్రోల్ బాంబు విసిరారు. అనంతరం అక్కడికి కేవలం 5కి.మీ దూరంలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సమీపంలోనూ బైక్పై వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరి పారిపోయాడు.
పెట్రోల్ బాంబు దాడిపై పోలీసులు ఏమన్నారు..
'షాహీన్బాగ్లో నిరసన చేపడుతున్న ఆందోళనకారులకు దూరంగా పోలీస్ బారికేడ్లపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించి సంఘటనా స్థలంలో కొన్ని సీసాలను స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.' అని సీనియర్ పోలీస్ అధికారి కుమార్ జ్ఞానేష్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బారికేడ్ల సమీపంలో పెట్రోల్ బాంబు విసిరినట్టు గుర్తించామన్నారు.
దేశమంతా కర్ఫ్యూ.. షాహీన్బాగ్లో మాత్రం నిరసనలు..
గత మూడు నెలలుగా షాహీన్బాగ్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22)న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆందోళనలు కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఆందోళనకారుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఆదివారం ఆందోళనలను విరమించుకుందామని చెప్పగా.. మరికొంతమంది కొనసాగిద్దామని పట్టుబట్టారు. చివరకు ఆందోళనలు కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ బారి నుంచి ప్రధాని మోదీ తమను రక్షించాలనుకుంటే.. ముందు సీఏఏ,ఎన్ఆర్సీ,ఎన్పీఆర్లను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారుల్లో ఒకరైన సలీమా శనివారం మీడియాకు వెల్లడించారు.
ఆందోళనకారుల జాగ్రత్తలు.. మాస్కులు,శానిటైజర్స్..
షాహీన్బాగ్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పీటీఐ వెల్లడించింది. ఆందోళనకారులకు మాస్కులు,శానిటైజర్స్ అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. గతంతో పోలిస్తే జనతా కర్ఫ్యూ రోజు ఆందోళనల్లో పాల్గొన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు తెలిపింది. నిజానికి ఢిల్లీలో కరోనా తీవ్రత నేపథ్యంలో 50మంది కంటే ఎక్కువమంది ఒకేచోట గుమిగూడవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆందోళనలకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. కానీ షాహీన్బాగ్ ఆందోళనకారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Recommended Video
లక్నోలోనూ కొనసాగుతున్న ఆందోళనలు..
ఉత్తరప్రదేశ్ లక్నోలోని క్లాక్ టవర్ వద్ద కూడా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరమంతా జనతా కర్ఫ్యూ వెలవెలబోతుంటే.. ఒక్క క్లాక్ టవర్ వద్ద మాత్రం కొంతమంది ముస్లిం మహిళలు సీఏఏకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టారు. లక్నోలో కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతోందని.. ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని పోలీస్ కమిషనర్ సూర్జిత్ పాండే వెల్లడించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం చాలాచోట్ల పోలీసులను మోహరించినట్టు తెలిపారు.