All Party Meet : మోదీ అఖిలపక్ష సమావేశం హైలైట్స్ ఇవే... జమ్మూకశ్మీర్పై ఏం తేల్చారంటే...
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంలో కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గురువారం(జూన్ 24) జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ నేతలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దానిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అలాగే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమావేశంలో మోదీ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలకు భద్రత,రక్షణతో కూడిన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యత అని చెప్పారు.
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ నేతలు మాట్లాడుతూ...వీలైనంత త్వరగా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. బ్యూరోక్రసీ ప్రభుత్వంలో ఒక భాగమని... అంతే తప్ప ప్రభుత్వాన్ని అది భర్తీ చేయలేదని అభిప్రాయపడ్డారు. అలాగే తక్షణమే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
జమ్మూకశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని గతంలో ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అరెస్టయి జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జమ్మూకశ్మీర్లో భూమి,ఉద్యోగాలపై స్థానికుల హక్కులను పరిరక్షించాలన్నారు.
కొంతమంది నేతలు జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అయితే ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉండటంతో దీనిపై పెద్దగా చర్చించలేదని సమాచారం.
సమావేశం అనంతరం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం,నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ... ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ రద్దు నిర్ణయాన్ని తాము ఒప్పుకోమన్నారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు.
ఇదే సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.గతంలో పార్లమెంటులో హామీ ఇచ్చిన రాష్ట్ర హోదా పునరుద్ధరణకు శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ,నియోజకవర్గాల పునర్విభజన కీలకంగా మారుతాయని చెప్పారు. సమావేశంలో జమ్మూకశ్మీర్ భవితవ్యంపై చర్చించామన్నారు.
అగస్టు 5,2019న జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జమ్మూకశ్మీర్లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించి... అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఈ సమావేశం ద్వారా తొలి అడుగు పడినట్లయింది.
Today’s meeting with political leaders from Jammu and Kashmir is an important step in the ongoing efforts towards a developed and progressive J&K, where all-round growth is furthered. pic.twitter.com/SjwvSv3HIp
— Narendra Modi (@narendramodi) June 24, 2021