కరోనా వేళ: బ్రిటన్లో సీరమ్ 240 మిలియన్ల పౌండ్ల పెట్టుబడి: మోడీ-బోరిస్ జాన్సన్ అగ్రిమెంట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యూకే-ఇండియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్, భారత్లో పరస్పరం పెట్టుబడులు పెట్టేలా ఈ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇప్పటికే భారత్లో ఒక బిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులను పెట్టబోతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి బదులుగా భారత్ కూడా ఆ దేశంలో బిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెడతామని ప్రకటించింది. దీనితోపాటు- సీరమ్ ఇన్స్టిట్యూట్ 230 మిలియన్ పౌండ్లను బ్రిటన్లో ఇన్వెస్ట్ చేయనుంది.
దీనిపై ఈ రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు కుదరబోతోన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ ఇవ్వాళ వర్చువల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీ సందర్భంగా వారిద్దరూ ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనున్నారు. భారత్లో బ్రిటన్ ప్రకటించిన ఒక బిలియన్ పౌండ్ల మేర పెట్టుబడుల వల్ల 6,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అంచనా వేసింది. పరోక్షంగా మరో లక్షమంది వరకు ఉపాధి లభిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video
భారత్-బ్రిటన్ మధ్య దౌత్య, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు. బ్రిటన్లో 533 మిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ఒప్పందాలు సిద్ధంగా ఉన్నాయి. కోవిసీల్డ్ను ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 240 మిలియన్ల పౌండ్ల పెట్టుబడులు బ్రిటన్లో పెట్టబోతోంది. భారత్ వెలుపల కూడా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా ఇదివరకే ప్రకటించారు.