యూఎన్ అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం "ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు"అందుకున్నారు. ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు ప్రధాని మోడీ. మోడీకి పర్యావరణంపై పూర్తి అవగాహన ఉందని ఈ క్రమంలోనే పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవాళికి ప్రమాదకరంగా పరిగణించాయని గుర్తించారని గుటెరెస్ అన్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేతలకు కూడా వాతావరణంలో మార్పుల వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసు కానీ.... దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోడీ మాత్రం దీన్ని గుర్తిండంతోపాటు చర్యలు కూడా తీసుకున్నారని అదీ ఇతర నాయకులకు ప్రధాని మోడీకి ఉన్న తేడా అని అన్నారు.
సెప్టెంబర్ 26న మోడీకి ఐక్యర్యాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రకటించింది. 73వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అవార్డును మోడీకి ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును తనకు బహుకరించినందుకు ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన అవార్డు దేశానికి అంకితం చేస్తున్నట్లు చెప్పిన ప్రధాని ప్రకృతితో భారత్ మమేకమైందని చెప్పారు. ప్రకృతిలోకానీ పర్యావరణంలో కానీ చోటుచేసుకుంటున్న మార్పులతో పేద ప్రజలే బాధితులుగా మారుతున్నారని చెప్పారు ప్రధాని. ఇతర పనులపై ఎంత శ్రద్ధ అయితే పెడుతామో అదే పర్యావరణ పరిరక్షణపై కూడా పెట్టాలని మోడీ కోరారు.
పర్యావరణ మార్పు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకత్వ లక్షణాలు ప్రదర్శించినందుకు గానూ భారత ప్రధాని మోడీతో పాటు... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్ను ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. ఇండియాలో 2022 కల్లా ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని మోడీ దేశంతో ప్రతిజ్ఞ చేయించారు.