లక్నో విమానాశ్రయంలో ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్నా: ఎందుకంటే?
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో విమానాశ్రయంలో ధర్నా చేశారు. తనను స్వాగతం పలికేందుకు వచ్చినవారిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన విమానాశ్రయంలోనే ఓ కూర్చిలో కూర్చుని నిరసన చేపట్టారు.
ప్రహ్లాద్ మోడీ నిరాహార దీక్ష
"ఈ రోజు, నేను ప్రయాగరాజ్ వెళ్ళవలసి ఉంది, నా కార్యక్రమాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. నా మద్దతుదారులు జైలులో ఉన్నప్పుడు నేను బయట స్వేచ్ఛగా నడిస్తే అన్యాయం అవుతుంది. అందువల్ల, నేను ఇక్కడ [లక్నో విమానాశ్రయం] ఆకలి(నిరహార దీక్ష)తో కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. నేను నీరు, ఆహారాన్ని ముట్టుకోను. నా జీవితం ముగిసినా నేను ఇక్కడి నుంచి కదలను' అని ప్రహ్లాద్ మోడీ స్పష్టం చేశారు.
పీఎంవో ఆర్డర్ చూపమంటే.. ఎందుకిలా?
ప్రహ్లాద్ మోడీ ఇంకా మాట్లాడుతూ.. 'ఇది ఎందుకు జరిగిందని నేను పోలీసులను అడిగినప్పుడు, పీఎంఓ ఆదేశాల మేరకు ఇది జరిగిందని వారు చెప్పారు. ఆర్డర్ కాపీని నాకు చూపించమని నేను వారిని అడిగాను, కానీ వారు అలా చేయలేదు. వారి వద్ద ఆర్డర్ కాపీ లేదా? లేక పీఎంఓ పేరును చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారో తెలియదు' అని అన్నారు. కాగా, విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ జోన్ వద్ద విధించిన 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రహ్లాద్ మోడీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. విమానాశ్రయం వద్దకు సుమారు 100 మంది వరకు తన మద్దతుదారులు వచ్చినట్లు ప్రహ్లాద్ మోడీ తెలిపారు.
గంటన్నర తర్వాత దీక్ష విరమించిన ప్రహ్లాద్ మోడీ
చౌదరి చరణ్ సింగ్ విమనాశ్రయ అడిషనల్ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇండిగో విమానంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రహ్లాద్ మోడీ లక్నోకు వచ్చారని తెలిపారు. అయితే, తన మద్దతుదారులను తన వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రహ్లాద్ మోడీ సుమారు గంటన్నరపాటు విమానాశ్రయంలో ధర్నాకు దిగారని చెప్పారు. ఆ తర్వాత తన మద్దతుదారులను పోలీసులు విడిచిపెట్టడంతో ప్రహ్లాద్ మోడీ అక్కడ్నుంచి వెళ్లిపోయారని తెలిపారు.