భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ - అవినీతి, మతతత్వానికి స్థానం లేదు: ప్రధాని మోదీ..!!
2047నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. మన జాతీయ జీవనంలో అవినీతి, కులతత్వం, మతతత్వాలకు చోటు లేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా 'అందరితో కలిసి, అందరి అభివృద్ధి' సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఈ సిద్ధాంతం ప్రపంచ సంక్షేమానికి దిక్సూచిగా మార్గదర్శనం చేస్తుందన్నారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు.
ప్రపంచపు ఎజెండాకు రూపం : జీ20 శిఖరాగ్ర భేటీ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మన దేశం జీ20 ప్రెసిడెన్సీని చేపట్టడంతో అనేక సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయని, వీటిలో కొన్ని తన మనసుకు చాలా దగ్గరయ్యాయని ప్రధాని చెప్పారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు. ప్రపంచపు ఎజెండాకు రూపమివ్వడానికి భారత దేశానికి జీ20 ప్రెసిడెన్సీ రావడం అద్భుతమైన అవకాశమని చెప్పారు. మానవుడే కేంద్రంగా ఉండే ప్రపంచంవైపు మరింతగా పరివర్తన చెందాలనే అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

నైపుణ్యం ఉన్న దేశంగా : జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) కేంద్రంగా చూడటం ప్రపంచంలో సంప్రదాయంగా వస్తోందని, ఈ దృక్పథం ఇప్పుడు మరింత సమ్మిళితత్వంతో, మానవుడే కేంద్రంగా ఉండే వైఖరికి మారుతోందని చెప్పారు. ఈ పరిణామ క్రమంలో భారత దేశం ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తోందన్నారు. భారత దేశం ఏ విధంగా పరివర్తన చెందుతోందో మోదీ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా 'అందరితో కలిసి, అందరి అభివృద్ధి' సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఈ సిద్ధాంతం ప్రపంచ సంక్షేమానికి దిక్సూచిగా మార్గదర్శనం చేస్తుందన్నారు. చాలా కాలం వరకు భారత దేశం అంటే 100 కోట్ల ఆకలి కడుపులు అని అనేవారని, ఇప్పుడు అది ఆకాంక్షలతో కూడిన వంద కోట్ల మందిగల దేశంగా, 200 కోట్ల నైపుణ్యంగల దేశంగా మారిందని చెప్పారు.

అద్భుతమైన అవకాశం : భారతీయుల ముందు అద్భుతమైన అవకాశం ఉందని మోదీ చెప్పారు. రాబోయే వెయ్యేళ్లపాటు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధికి పునాది వేయడానికి భారతీయులకు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశం త్వరలోనే అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ దశాబ్దం కన్నా తక్కువ సమయంలోనే మన దేశం ఐదు స్థానాలు ఎగబాకిందని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించడంపై పాకిస్థాన్, చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించుకోవడం సహజమేనని చెప్పారు.

దౌత్యమే సరైన మార్గం : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు ఘర్షణలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం తప్పనిసరి అని చెప్పారు. సైబర్ నేరాల వల్ల ఎదురయ్యే ముప్పును ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. ఉగ్రవాదులు తమ దుర్మార్గపు లక్ష్యాలను సాధించుకోవడం కోసం డార్క్నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వంటివాటిని ఉపయోగించుకుంటున్నారన్నారు. వీటి వల్ల దేశాల సామాజిక కలనేతపై పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. బూటకపు వార్తల వల్ల న్యూస్ సోర్స్ విశ్వసనీయత పోతుందని, సమాజంలో అశాంతి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications