ఆనంద కోల్కతాను అద్భుతంగా చేస్తా -పెట్టుబడులన్నీ బెంగాల్కే -దీదీ పేరెత్తకుండా మోదీ ఎన్నికల సభ
బెంగళూరును గార్డెన్ సిటీ, ముంబై మహా నగరాన్ని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్', హైదరాబాద్ ను ముత్యాల నగరం అని వ్యవహరించినట్లే తూర్పు భారతంలోని కోల్కతా నగరాన్ని 'సిటీ ఆఫ్ జాయ్' లేదా 'ఆనంద నగరం'అని వ్యవహరించడం తెలిసిందే. అయితే ఆనందన నగరమైన కోల్కతాను అద్భుతమైన భవిష్యత్ నగరంగా తీర్చి దిద్దుతానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో కరోనా విలయం, ఆక్సిజన్ కొరతపై శుక్రవారం కీలక సమీక్షలు జరిపిన తర్వాత ఆయన బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచే వర్చువల్ పద్ధతిలో బెంగాలీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

పెట్టుబడులన్నీ బెంగాల్కే..
దేశంలో సంస్థాగతంగా, విదేశాల నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రానున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పెట్టుబడుల్లోని సింహభాగం బెంగాల్కే వినియోగిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. బెంగాల్లోని సూరి, మాల్డా, బెర్హంపూర్, భవానిపూర్ ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారంనాడు ప్రసంగించారు. దేశానికి రాబోయే పెట్టుబడుల్లో ఎక్కువ మొత్తం బెంగాల్కు వెచ్చించి ప్రజల కలలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

కోల్తాను అలా మార్చేస్తాం
సిటీ ఆఫ్ జాయ్ గా పిలిచే కోల్కతాను సిటీ ఆఫ్ ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ మాటిచ్చారు. బెంగాలీ ప్రజలు ఉద్యోగావకాశాల కోసం, సులభతర జీవనం, సులభతర వాణిజ్యం కోసం ఎదురుచూస్తున్నారని, వారి అవసరాలన్నీ బీజేపీ తప్పనిసరిగా తీరుస్తుందని వాగ్దానం చేశారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా బెంగాల్లో పట్టు, జౌళి పరిశ్రమల అభివృద్ధికి బీజేపీ పాటుపడుతుందన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితి కారణంగా తాను టెక్నాలజీ సహకారంతో ప్రజలతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఉదయం నుంచి కీలక సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ టెక్నాలజీ సాయంతో ప్రజలతో అనుసంధానమవుతున్నట్టు చెప్పారు.

దీదీ పేరెత్తకుండా మోదీ జాగ్రత్త
కరోనా విలయ కాలంలోనూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండం, దేశం కల్లోలంలో ఉంటే మోదీ మాత్రం దీదీ నామస్మరణ చేస్తున్నారని మీమ్స్ వెల్లువెత్తడం తదితర పరిణామాలతో శుక్రవారం నాటి వర్చువల్ ర్యాలీలో మోదీ ఆచితూచి వ్యవహరించారు. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేరును ఒక్కసారి కూడా పలకకుండా తన విమర్శలను టీఎంసీ సర్కారుకు మాత్రమే పరిమితం చేశారు. బాంగ్లాదేశీ చొరబాటుదారులతో, వసూళ్ల దందాకు పాల్పడే సిండికేట్లతో టీఎంసీ సర్కార్ మిలాకత్ అయిందని ప్రధాని ఆరోపించారు. మార్పు కోరుకుంటోన్న బెంగాలీలు బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికలో ఈనెల 26న ఏడవ విడత పోలింగ్ జరుగనుంది. చివరిదైన ఎనిమిదో విడత ఎన్నికలు 29న జరుగుతాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications