యూకే ప్రధాని రిషి సునాక్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్: ఏం మాట్లాడుకున్నారంటే?
న్యూఢిల్లీ/లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ యునైటెడ్ కింగ్డమ్(బ్రిటన్) కొత్త ప్రధానమంత్రి అయిన మూడు రోజుల తర్వాత.. గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బ్రిటిష్ అత్యున్నత పదవిని చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
సమగ్ర, సమతుల్య ఎఫ్టిఎ: రిషి సునాక్తో ప్రధాని మోడీ
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై కూడా వారు మాట్లాడుకున్నారు. 'సమగ్ర, సమతుల్య ఎఫ్టిఎ' ముందస్తు ముగింపు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారని ప్రధాని మోడీ తెలియజేశారు. కాగా, 'మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తాము. సమగ్ర, సమతుల్య ఎఫ్టీఏ ముందస్తు ముగింపు, ప్రాముఖ్యతపై కూడా మేము అంగీకరించాము' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
మోడీకి ధన్యవాదాలు చెప్పిన రిషి సునాక్
తనకు అభినందనలు తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు రిషి సునక్. ట్విట్టర్ వేదికగా రిషి సునాక్ స్పందిస్తూ..'యునైటెడ్ కింగ్డమ్, భారతదేశానికి చాలా సారూప్యతలు ఉన్నాయి. రాబోయే నెలలు, సంవత్సరాల్లో మన భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా మన రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు ఏమి సాధించగలవో చూడటానికి నేను సంతోషిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్: భారతీయ సంబంధాలు
కాగా, సోమవారం సునాక్ కొత్త ప్రధాని అయిన తర్వాత.. ప్రధాని మోడీ చారిత్రాత్మక విజయంపై మాజీ ప్రధానిని అభినందించారు. యూకే భారతీయులకు ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు. 'రిషి సునక్కి హృదయపూర్వక అభినందనలు! మీరు యూకే ప్రధానమంత్రి అయ్యాక, నేను ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయడానికి, రోడ్మ్యాప్ 2030ని అమలు చేయడానికి ఎదురుచూస్తున్నాను. ఆధునిక భాగస్వామ్యంలో మా చారిత్రాత్మక సంబంధాలు యూకే భారతీయుల 'జీవన వారధి'కి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు' అని మోడీ పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ కు ప్రపంచ దేశాధి నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో సునాక్, అతని కుటుంబం 10వ నంబర్ పైన ఉన్న ఫ్లాట్లోకి మారాలని నిర్ణయించుకున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.












Click it and Unblock the Notifications