నిద్రలోనే చప్పట్లు కొడితే ఎలా?: ప్రధాని మోదీ కౌంటర్ అటాక్
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడుతున్నారు.
హైదరాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన దుమారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. స్టాక్ మార్కెట్లల్లో అదాని ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ భారీగా పడిపోయింది. ఇప్పటికే ఆ కంపెనీ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయింది.
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటోన్నారు. కళ్ల ముందే ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ నిలదీస్తోన్నారు.

ఉదయం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం లోక్ సభ సమావేశమైంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. అదాని వ్యవహారంపై నిప్పులు చెరిగారు. భారత్ జోడో యాత్ర ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ సభకు హాజరయ్యారు. జోడో యాత్ర తరువాత సభలో మాట్లాడటం ఇదే తొలిసారి.
ఈ అంశంపై తాజాగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని ఆయన పరోక్షంగా ఉటంకించారు. సభలో కొద్ది మంది ప్రసంగాలను తాను చూశానని, దాని గురించి ఆనందంగా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో వారు బాగా నిద్రపోయి ఉంటారని ఎద్దేవా చేశారు. టైమ్ కు నిద్ర లేవలేకపోయారని చురకలు అంటించారు.

ఆదివాసీలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని అడ్డగించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎస్టీలను ఓ సీనియర్ నాయకుడు అవమానించారని ప్రధాని మోదీ విమర్శించారు. వందేళ్లకు ఒకసారి సంభవించే కరోనా వైరస్ వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఒకవంక దేశ ఆర్థిక వ్యవస్థ, మరోవంక ప్రజలను కాపాడుకోగలిగామని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కు అద్దం పట్టిందని అన్నారు. ఆర్థికంగా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications