అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో 11న వర్చువల్గా సమావేశం కానున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్గా సమావేశం కానున్నారు. ఈ మేరకు వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తున్న రష్యాతో వాణిజ్య సంబంధాలకు భారత్ దూరంగా ఉండాలని పదే పదే అమెరికా సూచిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దక్షిణాసియాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతం సహా పలు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా, ప్రధాని మోడీ, అధ్యక్షుడు బైడెన్ భేటీ అనంతరం ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రులు కూడా చర్చల్లో పాల్గొననున్నారు. భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్.. అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చర్చలు సాగించనున్నారు.
మరోవైపు, రష్యాకు, అలీనోద్యమానికి భారత్ దూరంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు శనివారం అమెరికా ప్రభుత్వం తెలిపింది. భారత్, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించింది. దీన్ని మరింత పెంచుకోవడానికి అవకాశాలున్నాయంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుసంపన్నత, భద్రతకు ఇది కీలకమని తెలిపింది.
రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తులను డిస్కౌంట్ కే దిగుమతి చేసుకుంటున్నా.. అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యాతో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరపకూడదని అమెరికా కోరుతోంది. అయితే, భారత్ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అని భారత్ స్పష్టం చేస్తోంది. ఐరోపా దేశాలే అత్యధిక చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని కౌంటర్ ఇచ్చింది.