సాధారణ వ్యక్తి పెళ్లికి ప్రధాని మోడీ విషెస్.. లేఖలో ఏముందో తెలుసా ???
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సామాన్యుల పట్ల ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన ఓ యువకుడి వివాహ ఆహ్వానానికి స్వయంగా స్పందిస్తూ పంపిన అభినందనల లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడు ఒక సాధారణ పౌరుడి ఆహ్వానాన్ని గౌరవించడం ప్రజల్లో విశేష స్పందనను రేపుతోంది.
కాగా రాయచూరు జిల్లా కనిహాల గ్రామానికి చెందిన రాజేశ్ నాయక్, సవితల వివాహం మే 13న జరిగింది. ప్రధాని మోదీకి అభిమానిగా ఉన్న రాజేశ్, తన పెళ్లి పత్రికను పోస్టు ద్వారా ప్రధాని కార్యాలయానికి పంపించాడు. సాధారణంగా ఇలాంటి ఆహ్వానాలు పెద్దగా స్పందన పొందకపోయినా, మోదీ నుంచి ప్రత్యక్షంగా సమాధానం వస్తుందని అతను ఊహించలేదు.

కానీ మే 16న వచ్చిన ఒక అధికారిక లేఖ రాజేశ్ కుటుంబాన్ని ఆనందంతో ఉప్పొంగేలా చేసింది. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆ లేఖలో మోదీ, నూతన దంపతులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ప్రేమ, పరస్పర గౌరవం, అవగాహనతో నిండాలని ఆకాంక్షించారు.
లేఖలో ఏం ఉందంటే..
"మీ వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో ఒకరికొకరు అండగా నిలుస్తూ, మీ కలలను సాధించండి. మీ జీవితం సంతోషం, శాంతి, విజయాలతో నిండాలి" అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ అనుభవంపై రాజేశ్ నాయక్ భావోద్వేగంగా స్పందించారు. "నా పెళ్లి పత్రిక ప్రధాని వరకు చేరుతుందని అనుకున్నా, ఆయన నుంచి ఇంత ఆత్మీయంగా లేఖ వస్తుందని మాత్రం ఊహించలేదు. ఇది నా జీవితంలో గొప్ప గుర్తుగా నిలుస్తుంది" అని అన్నారు. ఈ లేఖ తన కుటుంబానికే కాదు, మొత్తం గ్రామానికి గర్వకారణమని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడి ఆహ్వానాన్ని గౌరవించిన ప్రధాని తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా మోదీ వినయం, ప్రజలతో ఆయన అనుబంధంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.












Click it and Unblock the Notifications