ప్రధాని మోడీ ఎన్నికల సీజన్లో మాత్రమే ఉగ్రవాదం గురించి మాట్లాడతారు: యూపీ ప్రచారంలో ప్రియాంకాగాంధీ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల సీజన్లోనే ఉగ్రవాదం గుర్తొస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్నో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలను పక్కన పెట్టి ఉగ్రవాదంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Recommended Video
మోడీని, బీజేపీని టార్గెట్ చేసిన ప్రియాంకా గాంధీ
ఆ తర్వాత యుపిలోని హర్దోయ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ అధికార బీజేపీని టార్గెట్ చేశారు. ప్రజల వద్ద తిండికి డబ్బు లేదని, ఉద్యోగ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు "ఉపాధి, ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం, మహిళల సాధికారత, రైతుల సమస్యల పరిష్కారం చెయ్యటం లేదన్నారు.
బీజేపీ యూపీలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదు
విచ్చలవిడిగా పంటలను నాశనం చేస్తున్న జంతువుల నుండి విముక్తి, ఖరీదైన విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం గురించి అధికారపార్టీ మాట్లాడితే వినాలని అనుకుంటున్నారని, కానీ ఆ సమస్యలపై మాట్లాడకుండా కేవలం ఉగ్రవాదంపై మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. బీజేపీ యూపీలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని, ప్రజలకు ఏమి చెప్పాలో కూడా అర్ధం కాక ఉగ్రవాద వ్యాఖ్యలను చేస్తున్నారని అన్నారు.
బిజెపి నాయకులు కేవలం మతం, పాకిస్తాన్ మరియు ఉగ్రవాదం గురించి మాట్లాడతారు
గత ఐదేళ్లలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలను అందించలేదని పేర్కొన్నారు. బిజెపి నాయకులు కేవలం మతం, పాకిస్తాన్ మరియు ఉగ్రవాదం గురించి మాట్లాడతారు. కానీ నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడరు అని పేర్కొన్నారు. ప్రజలకు ఆహారం కోసం డబ్బు లేదు. వారు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే బిజెపి నాయకులు మాత్రం మన మనస్సును మతం మరియు పాకిస్తాన్ వైపు మళ్లిస్తారు అని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ఉచిత రేషన్ మాత్రమే ప్రజలను ఆత్మ నిర్భర్ చెయ్యదు
మా బతుకులు అన్ని మా పిల్లల బ్రతుకులు కూడా జీవితమంతా దేశం కోసం ఎదురు చూడడానికి కేటాయించదలుచుకోలేదు అని యూపీ ప్రజలు భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొంత డబ్బు, ఉచిత రేషన్ మాత్రమే ప్రజలను ఆత్మ నిర్భర్ చేయదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
నాలుగో దశ ఓటింగ్ ఫిబ్రవరి 23న...సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓట్లెయ్యండన్న ప్రియాంక
అసెంబ్లీ ఎన్నికలలో నాలుగో దశ ఓటింగ్ ఫిబ్రవరి 23న నిర్వహించబడుతుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాల్గవ దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున లక్నోలోని చిన్హట్ ప్రాంతంలో రోడ్షో నిర్వహించి, సమస్యల పరిష్కారం కోసం ఓటు వేయాలని ప్రజలకు ఉద్బోధించారు.
ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చూపే వారికి ఓటు వేయమని మేము వారికి చెబుతున్నామన్నారు. కులం మరియు మతం గురించి మాట్లాడి వారిని విభజించి అభివృద్ధి చేయాలనుకునే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు.