లాక్ డౌన్ 2.0 : భారత్లో మే 3వరకు పొడగింపు.. మోదీ ప్రసంగం హైలైట్స్
భారత్లో లాక్ డౌన్ను మే 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొడగింపే సరైందని భావిస్తున్నట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,అధికారులు,నిపుణులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి వైరస్ ప్రభావం లేనిచోట్ల సడలింపులపై ఆలోచిస్తామన్నారు. గత మూడు వారాల్లో మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి కావడం విశేషం. నిజానికి లాక్ డౌన్ను పొడగిస్తారా లేక ఆరెంజ్,రెడ్,గ్రీన్ జోన్లుగా విభజించి లాక్ డౌన్కు కొంత సడలింపునిస్తారా అన్న చర్చ జరుగుతూ వస్తోంది. ఈ మీమాంసకు తెరదించుతూ ప్రధాని మోదీ పొడగింపుపై ప్రకటన చేశారు.
Recommended Video
కష్టాలు ఎదురైనప్పటికీ ప్రజలు సహకరిస్తున్నారు
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో దేశ ప్రజలు సహకరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్,సోషల్ డిస్టెన్స్ వంటి చర్యల ద్వారా కరోనాపై యుద్దంలో కొంతమేర సఫలమయ్యామని చెప్పారు. దేశ ప్రజలు అనేక ఇబ్బందులు,కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. లాక్ డౌన్కు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. ప్రతీ పౌరుడు దేశం కోసం ఓ సైనికుడిలా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పీరియడ్లోనే కొత్త సంవత్సర పండగలు వచ్చాయని.. అయినప్పటికీ ఇంట్లోనే ఉండి నిరాడంబరంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు.
ఈ సంకల్పం అంబేడ్కర్కు నిజమైన నివాళి
డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలంతా సామూహికంగా తమ సంకల్పాన్ని చాటుకోవడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భారత్ అంబేడ్కర్ నుంచి నిరంతర ప్రేరణ పొందుతుందన్నారు. ఇక కరోనా కట్టడి విషయంలో భారత్ ముందుగానే తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం.. 14 రోజుల పాటు ఐసోలేషన్,క్వారెంటైన్లలో ఉంచడం ఫలితానిచ్చిందన్నారు.
ముందుగానే మేల్కొన్నామన్న మోదీ..
దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాక ముందు నుంచే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని మోదీ తెలిపారు. కేసుల సంఖ్య 100 కి చేరగానే విదేశీ ప్రయాణికులందరినీ సర్వైలైన్స్లో ఉంచామని తెలిపారు. ఆ తర్వాత కేసుల సంఖ్య 550కి చేరగానే 21 రోజుల లాక్ డౌన్ విధించామన్నారు. కొన్ని నిజాలను విస్మరించరాదని.. నేడు ప్రపంచంలోనే అత్యాధునిక వసతులు కలిగిన దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. చాలా దేశాల్లో వేల మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని.. ఒకవేళ భారత్ సరైన చర్యలు తీసుకోకపోయి ఉంటే ఆ పరిస్థితిని ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ వనరులు ఉన్నప్పటికీ సోషల్ డిస్టెన్స్,లాక్ డౌన్తో భారత్ కరోనాను ఎదుర్కొంటోందని అన్నారు.
హాట్ స్పాట్ల గుర్తింపు.. కట్టుదిట్టమై చర్యలు
కరోనా నియంత్రణ కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్న తరుణంలో... దీనిపై ఎలా ముందుకెళ్లాలి.. ప్రజలు కష్టాలు ఎలా తీర్చాలి.. వంటి అంశాలపై నిరంతర చర్చలు జరిపినట్టు తెలిపారు. లాక్ డౌన్ పొడగింపు ద్వారా అన్ని స్థాయిల్లో వైరస్ నియంత్రణకు అవకాశం ఉంటుందన్నారు. వైరస్ సోకి ఒక్క వ్యక్తి చనిపోయినా దేశంలో ఆందోళన పెరుగుతుందని.. అందుకే ఎక్కడికక్కడ హాట్ స్పాట్లను గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కొత్త గైడ్ లైన్స్ రేపు జారీ..
లాక్ డౌన్ పీరియడ్లో ఏయే ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చామో.. ఒకవేళ అక్కడ ఒక్క కేసు నమోదైనా సరే.. మినహాయింపులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. లాక్ డౌన్కు సంబంధించి సంపూర్ణ నివేదిక,తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం(ఏప్రిల్ 15)న కొత్త మార్గదర్శకాలు జారీ అవుతాయని చెప్పారు. దినసరి కూలీలు,రబీ పంట కోతలు,ఆయా సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని గైడ్ లైన్స్ రూపొందించినట్టు వివరించారు.
యువ శాస్త్రవేత్తలకు పిలుపు
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన వనరులను వేగంగా సమకూర్చుకున్నామని చెప్పిన మోదీ.. దేశవ్యాప్తంగా 600 పైగా ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయని చెప్పారు. ప్రతీరోజూ కొత్త వసతులు,సౌకర్యాలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ల్యాబ్లు,పడకల సంఖ్య పెరిగిందన్నారు. పరిమిత వనరులతోనే భారత్ కరోనాపై యుద్దం చేస్తున్న తరుణంలో.. దేశంలోని యువ సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ముందుకు రావాలని కృషి చేయాలని పిలుపునిచ్చారు.