మెట్టు దిగిన మోడీ-అమిత్ షా: అద్వానీ-మురళీ మనోహర్ జోషిలకు బుజ్జగింపు
న్యూఢిల్లీ: యూపీలో ఓటములు, నాలుగేళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నప్పటికీ ఉప ఎన్నికల్లో ఓటములు, ఏకమవుతున్న విపక్షాల... దీంతో మోడీ, అమిత్ షాలు ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే శివసేన, జేడీయూ, అకాలీదళ్ వంటి మిత్రపక్షాలతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
వయోపరిమితి నిబంధనతో పలువురు పార్టీ అగ్రనేతలను ప్రభుత్వ, పార్టీ పదవులకు దూరంగా పెట్టిన బీజేపీ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ నిబంధనను పక్కన పెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేత అద్వానీ 2019 లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలని మోడీ, అమిత్ షా కోరుకుంటున్నారని తెలుస్తోంది. మురళీ మనోహర్ జోషీ లాంటి నేతలనూ ఎన్నికల బరిలోకి దించే యోచనతో ఉంది.
ఇటీవల ప్రధాని మోడీ ఢిల్లీలో అద్వానీ ఇంటికి వెళ్లి వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని కోరారని తెలుస్తోంది. 90 ఏళ్ల అద్వానీ ప్రస్తుతం గాంధీ నగర్ బీజేపీ ఎంపీ అయినప్పటికీ ఏ ప్రభుత్వ పదవిలోనూ లేరు. నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, మంత్రి మండలిలో ప్రవేశానికి వయో పరిమితి నిబంధనను ముందుకు తీసుకురావటంతో అద్వానీ, మురళీ మనోహర్ జోషీ తదితర సీనియర్ నేతలు ప్రభుత్వ పదవులకు దూరమవ్వాల్సి వచ్చింది.
పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాక మండలి పార్లమెంటరీ బోర్డులోనూ వారికి చోటు దక్కలేదు. ఆ తర్వాత అయిదుగురు సభ్యులతో కూడిన మార్గ దర్శక్ మండలిని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఏర్పాటు చేసి అందులో అద్వానీ, జోషీలకు చోటుకల్పించినా ఆ మండలి ఇంత వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు.