మిలిటెంట్ల ఇలాకాలో మోదీ మీటింగ్.. అస్సాంలో ప్రధాని పర్యటన ఖరారు..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనల కారణంగా గతంలో రద్దైన అస్సాం పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి చేపట్టనున్నారు. ఈసారి ఏకంగా మిలిటెంట్ల స్థావరంగా పేరుమోసిన కోఖ్రాజర్ లోనే ఆయన సభ నిర్వహించనున్నారు. ప్రధాని అస్సాం పర్యటనకు సంబంధించి సోమవారం అధికార వర్గాలు ప్రకటన చేశాయి. ఈ నెల 7న మోదీ అస్సాంలోని కోఖ్రాజర్ కు వెళతారని తెలిపాయి.
సీఏఏ అల్లర్ల తర్వాత..
దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ముందు సీఏఏపై నిరసనలు వ్యక్తమైంది అస్సాంలోనే. బంగ్లాదేశీ వలసదారుల సమస్య ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలో.. సీఏఏను అమలు చేయొద్దంటూ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. జనవరి 10న గౌహతిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభించడానికి ప్రధాని మోదీ వెళ్లాల్సిఉన్నా.. సీఏఏ నిరసనల కారణంగా పర్యటన అర్ధాంతరంగా రద్దైంది. ప్రస్తుతం అస్సాంలో పరిస్థితులు చక్కబడటంతో పర్యటనకు మార్గం సుగమమైంది.

మిలిటెంట్లతో శాంతి ఒప్పందాలు..
సీఏఏ నిరసనలు తగ్గుముఖంపట్టడంతోపాటు ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం.. అస్సాంలోని బోడో మిలిటెంట్లతో శాంతి ఒప్పందాలు చేసుకోవడంతోనూ ప్రధాని పర్యటనకు సానుకూలత ఏర్పడింది. శాంతి ఒప్పందాల తర్వాత సుమారు 1500 మంది 'నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్' మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. శాంతికి చిహ్నంగా.. నిన్నటిదాకా మిలిటెంట్ల ఇలాకాగా ముద్రపడ్డ కోఖ్రాజర్ లోనే ప్రధాని సభ నిర్వహిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications