జాగ్రత్త ..అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఫినిష్..!
నవంబర్ 17 లోగా వివాదాస్పద అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో పోలీసులు సోషల్ మీడియాపై డేగ కన్ను వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఎవరైనా సరే తీర్పు వస్తున్న సమయంలో కానీ వచ్చిన తర్వాత కానీ సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

సోషల్ మీడియాపై నిఘావర్గాల కన్ను
సున్నితమైన అయోధ్య విషయంలో సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని వదలబెట్టబోమని ఉత్తర్ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అనాలోచిత పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. సోషల్ మీడియాపై తమ ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టి నిఘా వేసి ఉంచాయని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు.

ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు నిర్వహించరాదు
ఇక అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎలాంటి చర్చలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో చేసే ప్రతి ఫోన్కాల్స్ పై నిఘా ఉంటుందని వాటిని స్కాన్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే రాళ్లు, ఇటుకల సేకరణపై నిషేధం విధించిన ప్రభుత్వం కిరోసిన్ అమ్మకాలపై కూడా నిషేధం విధించింది. అయోధ్యలో ఎలాంటి ర్యాలీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేదని డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. మతసామరస్యానికి విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు పెట్టడంపై నిషేధం విధిస్తున్నట్లు అయోద్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆంక్షలు డిజెంబర్ 28, 2019 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఇక అయోధ్య అంశంపై మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబర్ 16న ముగిసిన వాదనలు
ఇక అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు వరుసగా 40 రోజుల పాటు వాదనలు వినింది. అక్టోబర్ 16న వాదనలు ముగియగా తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2.77 ఎకరాల భూమి ఎవరికి చెందుతుందో అనేదానిపై తీర్పు ఇవ్వనున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ఇది తాను రిటైర్ అయ్యేలోపు ఇవ్వాలని భావిస్తున్నారు. 2.77 ఎకరాలు భూమి శ్రీరాముడికి చెందుతుందని హిందువులు వాదిస్తుండగా... ముస్లింలు మాత్రం అక్కడ మసీదు ఉండేదని అందుకే ముస్లింలకు చెందుతుందని వాదించారు.












Click it and Unblock the Notifications