నా పక్కన పడుకుంటావా: మహిళతో నీచంగా కానిస్టేబుల్
చెన్నై: ఓ రైల్వే పోలీసు ఓ మహిళా ఉపాధ్యాయురాలితో అత్యంత నీచంగా ప్రవర్తించాడు. సాయం చేసే నెపంతో ఆమె పట్ల అత్యంత అసభ్యకరమైన రీతిలో వ్యవహరించాడు. ముత్తునగర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ సంఘటన జరిగింది. తన ఇద్దరు పిల్లలతో 37 ఏళ్ల స్కూల్ టీచర్ వద్ద రైల్వే పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరమైన ప్రతిపాదన పెట్టడమే కాకుండా ఆమె నిద్రించిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు కూడా.
తమిళనాడులోని తంబారం వెళ్లడానికి ఆ మహిళ సోమవారం రాత్రి కొవిలిపట్టిలో రైలు ఎక్కింది. ఆమెకు రిజర్వ్డ్ టికెట్ లేదు. ఆమె ఆర్ఎసిపై ప్రయాణిస్తోంది. వినోద్ అనే జిఆర్పి కానిస్టేబుల్ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మదురై జంక్షన్లో రైలు ఎక్కాడు. ఆమెతో సంభాషణలో దిగాడు. పిల్లలకు, ఆమెకు బెర్తులు సంపాదించి పెడుతానని హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చి అతను ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. బెర్తులు దొరకగానే ఫోన్ చేస్తానని చెప్పాడు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఓ గంట తర్వాత అతని ఫోన్ చేసి బెర్తులు దొరకలేదని, ఆమెకు అభ్యంతరం లేకపోతే తన సీటును తనతో పాటు పంచుకోవచ్చునని అతను చెప్పినట్లు బాధితురాలి వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో బుధవారం వార్తాకథనాలు వచ్చాయి. దాంతో ఇబ్బందికి గురైన మహిళ ఫోన్ కట్ చేసింది.
అర్థరాత్రి దాటిన తర్వాత మర్నాడు ఒంటి గంట సమయంలో తనను ఎవరో స్పర్శిస్తున్నట్లు అనిపించి లేచి, కేకలు వేసిందని చెప్పారు. దాంతో పక్కన ఉన్నవారంతా లేచారు. ఆ సమయంలో తిరుచి జంక్షన్ వద్ద రైలు మెల్లగా నడుస్తోంది. దాంతో అతను రైలు నుంచి దుమికి వెళ్లిపోయాడు.
అయితే, హడావిడిలో అతను తన లాఠీని, లాగ్ బుక్ను మరిచిపోయాడు. మహిళ తంబారం చేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నట్లు చెబుతున్నారు. తిరుచిలో సంఘటన జరిగింది కాబట్టి తాము ఫిర్యాదు తీసుకోబోమని తంబారం పోలీసులు మొదట చెప్పారు. తన కానిస్టేబుల్ లాఠీని, లాగ్బుక్కును మాత్రం వాళ్లు తీసుకున్నారు. ఆ తర్వాత తంబారం పోలీసులు తిరుచికి కేసుపై మెమో పంపించారు.