థరూర్ వ్యాఖ్యపై పోలీస్ బాస్, 'నోటీస్' ట్విస్ట్ నాడు స్వామి చెప్పిందే..
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఆరోపణలలో వాస్తవం లేదని ఢిల్లీ పోలీసు నగర కమిషనర్ బస్సీ గురవారం ఉదయం వెల్లడించారు. తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో తనను ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని మంగళవారం శశిథరూర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై నగర పోలీసు కమిషనర్ బస్సీ మాట్లాడారు. శశిథరూర్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ విషయమై తాను పోలీసు అధికారులను అడిగానని, అలాంటిదేమీ లేదని వారు చెప్పారన్నారు.
మరోవైపు, సునంద హత్య కేసులో భర్త శశిథరూర్ను ప్రశ్నించేందుకు పోలీసులు నోటీసు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం శశిథరూర్ అనారోగ్యంతో కేరళలోని ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పోలీసులు కేరళ పయనమయ్యారు.
నోటీసులు పంపలేదు: పోలీసులు
శశిథరూర్కు నోటీసులు పంపించలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కేసు దర్యాఫ్తుకు సహకరించేందుకు థరూర్ సిద్ధంగా ఉన్నారని బస్సీ చెప్పారు. తాము నోటీసులు పంపించినట్లుగా వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలే అన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి చెప్పిందే నిజమైందా?
సునంద అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సునందపై విషప్రయోగం జరిగిందని పేర్కొన్నారు.
ఆమెకు రష్యన్ పాయిజన్ ఇచ్చారని కూడా చెప్పారు ఆ విషం పొలోనియం-210 అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలీసులు.. స్వామి చెప్పినట్లుగానే సునందపై విష ప్రయోగం జరిగిందని ప్రకటించారు. అది పోలోనియం అనే వార్తలు వచ్చినప్పటికీ, నిర్ధారించాల్సి ఉంది.